జానపద చిత్రాలకు కేరాఫ్గా నిలిచి స్టార్గా రాణిస్తున్న ఏఎన్నార్ జోరుకు ఒక్క సినిమా బ్రేకులు వేసింది. పెద్దగా గుర్తింపు లేని ఎన్టీఆర్ని ఓవర్ నైట్లో స్టార్ని చేసిందో మూవీ. అదేంటి? దాని వెనక స్టోరీ ఏంటో చూద్దాం.
ఎన్టీఆర్, ఏఎన్నార్లను అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్లు అంటుంటారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందే ఏఎన్నార్ సినిమాల్లోకి వచ్చారు. స్టార్ గా ఎదిగారు. ఆయన ప్రారంభంలో జానపద చిత్రాలతో మెప్పించారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వస్తున్న సమయంలోనే అక్కినేని పెద్ద స్టార్ హీరో. ఫోక్లోర్ చిత్రాల విషయంలో ఆయనకు తిరుగులేదు. అలాంటి టైమ్లో అక్కినేనిని దెబ్బకొట్టిందో మూవీ. పెద్దగా గుర్తింపు లేని ఎన్టీఆర్ని స్టార్ని చేసింది.
26
అక్కినేని హవాని దెబ్బకొట్టిన మూవీ పాతాళ భైరవి
ఏఎన్నార్ తిరుగులేని హవాని దెబ్బకొట్టిన ఒకే ఒక్క మూవీ `పాతాళ భైరవి`. కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మరో జానపద చిత్రం. పింగళి, కమాలకర కామేశ్వరరావు రచయితలుగా పనిచేసిన ఈ మూవీని విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, మాలతి నటించారు. ఈ మూవీతోనే చిన్న పాటలో సావిత్రి వెండితెరకు పరిచయం అయ్యింది.
36
పాతాళ భైరవికి మొదట అనుకున్న హీరో ఏఎన్నార్
అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు. జానపద చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తోన్న ఏఎన్నార్ని అనుకున్నారు. అలాగే అంజలిని హీరోయిన్గా, నేపాల మాంత్రికుడుగా గోవిందరాజుల సుబ్బారావుని అనుకున్నారు. అయితే ఏఎన్నార్ని తోట రాముడిగా ఊహించుకోలేకపోయారు దర్శకుడు కేవీ రెడ్డి. ఎందుకంటే అక్కినేని జానపద చిత్రాలు చాలా చేశారు. కొత్తదనం ఉండదు, కొత్తవారైతే బాగుండని భావించారు. ఆడిషన్స్ నిర్వహించారు. రాజారెడ్డిని ఎంపిక చేశారు. కానీ ఆయనకు నత్తి ఉండటంతో పక్కన పెట్టారు. హీరో దొరక్క ఏం చేయాలో అర్థం కాలేదు. టైమ్ గడిచిపోతుంది. ఓ రోజు సాయంత్రం విజయ ప్రొడక్షన్ వద్ద కేవీ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, పింగళి అంత కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
ఆ స్టూడియోకి కొంత దూరంలో ఇద్దరు కుర్రాళ్లు షటిల్ ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఏఎన్నార్, ఎన్టీఆర్. అక్కినేనినే అందులో విజయం సాధిస్తున్నాడు. దీంతో అందరి చూపు ఆయనపైనే ఉంది. కానీ దర్శకుడు కేవీరెడ్డి చూపు మాత్రం ఎన్టీఆర్పై ఉంది. ఓడిపోతున్న నేపథ్యంలో అతనిలో ఉన్న అసహనం, గెలవాలనే తపన బాగా కనిపించింది. తోటరాముడు పాత్రకి దగ్గరగా కనిపించాడు. దీంతో వెంటనే తనకు హీరో దొరికాడని నిర్మాతలతో చెప్పారు. నిర్మాతలు నో చెప్పినా, వినలేదు. కొన్ని సీన్లు చిత్రీకరించి చూశారు. `బొడ్డు దేవర సన్నివేశాన్ని` ముందుగానే చిత్రీకరించారు. రామారావు సింగిల్ టేక్లో చేశారు. ఎన్టీఆర్ నటనకు అంతా ఫిదా అయ్యారు. అలా `పాతాళ భైరవి`లోకి ఎన్టీఆర్ వచ్చారు. అంజలి స్థానంలో మాలతిని ఎంపిక చేశారు.
56
పాన్ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించిన పాతాళ భైరవి
గోవిందరాజుల సుబ్బారావు చేయాల్సిన నేపాల మాంత్రికుడి పాత్రకి చిన్న చిన్న వేషాలు వేస్తున్న ఎస్వీ రంగారావుని ఎంపిక చేశారు. `నేను రానంటే రాను రాను` అనే పాటలో సావిత్రి మెరిసింది. ఈ మూవీ 1951 మార్చి 15న విడుదలైంది. ఇటీవలే 75ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ అప్పట్లోనే ఇదొక పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. ఇతర భాషల్లోనూ దీన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు. విడుదల చేసిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ గా నిలిచింది.
66
ఓవర్ నైట్లో స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఎస్వీఆర్, రేలంగి, సావిత్రి
ఈ మూవీతోనే ఎన్టీఆర్ ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారు. జానపద చిత్రాలకు ఆయన కేరాఫ్గా నిలిచారు. ఈ మూవీ తర్వాత ఏఎన్నార్ జానపదాలు మానేసి సోషల్ మూవీస్ చేశారు. అలాగే ఈ మూవీతోనే మాలతి మేటి హీరోయిన్గా ఎదిగింది. మరోవైపు చిన్న చిన్న పాత్రలు చేసే ఎస్వీఆర్ ఈ మూవీతో స్టార్ విలన్గా అవతరించారు. అలాగే రేలంగి స్టార్ కమెడియన్గా మారిపోయారు. ఈ మూవీతోనే సావిత్రి బిజీ అయిపోయింది. మొత్తంగా ఏఎన్నార్ హవాని దెబ్బకొట్టి ఎన్టీఆర్ని ఓవర్నైట్లో స్టార్ చేసిన మూవీగా, చాలా మంది నటీనటులను స్టార్స్ గా మార్చిన మూవీగా `పాతాళ భైరవి` నిలుస్తుందని చెప్పొచ్చు.