
ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్న ఏకైక పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా.. నేనున్న అని ముందుకు వస్తుంటాడు. ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నాడు. దాసరి నారాయరణరావు తరువాత ఆ స్థానంలో చిరంజీవిని చూసుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని 24 శాఖలలో ఏ సమస్య వచ్చినా.. చిరంజీవి గుమ్మం తొక్కుతున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో ఎదిగిన మెగాస్టార్.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ను స్టార్ట్ చేసి.. మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఈక్రమంలో ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఎన్నో అవమానాలను దిగమింగాడు. 45 ఏళ్ల కెరీర్ లో చిరు ఎదుర్కొన్న కొన్ని అవమానాల గురించి చూస్తే.. ?
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలు చేశాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. హీరోగా ఎదిగాడు. హీరోగా మారిన తరువాత కూడా ఆయనకు సమస్యలు తప్పలేదు. కొంత మంది దర్శకులు, నిర్మాతలు చిరంజీవిని అవమానకరంగా మాట్లాడేవారు. ఈ విషయాలను కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా వెల్లడించారు. 80వ దశకంలో స్టార్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఉన్న క్రాంతికుమార్ చిరంజీవితో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ ఆయనే మెగాస్టార్ ను ఎక్కువగా అవమానించారు కూడా.
ఈ విషయం గురించి ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ..'' న్యాయం కావాలి షూటింగ్ జరుగుతుంది. సెట్ లో 400 మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. నేను సెట్ బయట ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి.. కోర్టు సెట్ లో ఉన్న బోనులో నిల్చున్నాను. అప్పుడు క్రాంతి కుమార్ వచ్చి.. ఏంటయ్య నీకు కూడా చెప్పాలా.. నువ్వేమన్నా స్టార్ హీరో అనుకుంటున్నావా, షాట్ ఉన్నా లేకున్నా ఇక్కడ పడుండాలని తెలియదా, అక్కడ జగ్గయ్య, శారదలాంటి వారు కూడా ఉన్నారు కదా అని అరిచారు''.
చిరంజీవి మాట్లాడుతూ... ''డైరెక్టర్ క్రాంతి కుమార్ అంతమందిలో అలా అవమానించేలా మాట్లాడేసరికి నా మనసు బాధపడింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయాలనిపించలేదు. కానీ సాయంత్రం ఫోన్ చేసి.. క్రాంతికుమార్ నాతో మాట్లాడారు.. షూటింగ్ సెట్ లో శారద బాగా ఇబ్బంది పెట్టింది.. ఆ చిరాకులో నిన్ను అన్నాను అని చెప్పారు. ఎవరి మీదనో కోపం ఉంటే.. అది నా మీద చూపించారు. అప్పుడే అనుకున్నాను.. నేను స్టార్ హీరో అయితే నన్ను అనేవారు ఉండరు కదా.. ఆ అవమానాన్ని మంచికి ఉపయోగించుకున్నాను, పట్టుదలతో ఎదిగి చూపించాను. నువ్వు స్టార్ హీరోవా అని అన్నారు కదా.. యస్ నేను స్టార్ హీరోనే అని ఫిక్స్ అయ్యాను.. అయ్యి చూపించాను''. అని చిరంజీవి అన్నారు.
చిరంజీవి ని మరోసందర్భంలో కూడా క్రాంతి కుమార్ అవమానించారు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో క్రాంతి కుమార్ నిర్మాతగా శివుడు శివుడు శివుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు ఒక షాట్ కు సబంధించి చిరంజీవి కోదండరామిరెడ్డికి సలహా ఇచ్చారు. ఆయన కూడా బాగుంది.. అలాగే చేద్దాం అని అన్నారు. కానీ నిర్మాతగా ఉన్న క్రాంతి కుమార్ మాత్రం కోదండరామిరెడ్డితో '' డైరెక్టర్ వి నువ్వా ఆయన, హీరో చెపితే సరే అంటావా'' అని అందరి ముందు అవమానకరంగా మాట్టాడారట. దాంతో ఈ సినిమా నుంచి కోదండరామిరెడ్డి వెంటనే తప్పుకున్నారు. ఆతరువాత ఆ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. చిరంజీవి మాత్రం ఇటు కోదండరామిరెడ్డితో, అటు క్రాంతికుమార్ తో సినిమాలు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అంతే కాదు అవకాశాల కోసం చెన్నైలో అద్దెకు ఉన్న రోజుల్లో కూడా చిరంజీవి ఇటువంటి అవమానాలనే అనుభవించారు. ఓ సినిమా ప్రివ్యూకి ఆహ్వానం అందగా.. చిరంజీవి తన స్పేహితులతో కలిసి వెళ్లారు. కూర్చొని సినిమా చూస్తుండగా..మధ్యలోనే వాళ్లను పైకి లేపి.. ఆ సీట్లను వేరే వీఐపీలకు ఇచ్చారు. ఈ సీట్లు మీకోసం కాదు అంటూ అవమానకరంగా మాట్లాడారు.
అప్పుడు చిరంజీవి ఇంకా బలంగా నిర్ణయించుకున్నారు ఎలాగైనా హీరో అవ్వాలని . ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా అన్ని అవమానాలు పడిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంతో పాటు.. తన ఫ్యామిలీ నుంచి స్టార్లు.. సూపర్ స్టార్లు, పాన్ ఇండియా హీరోలను ఇండస్ట్రీకి ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ ను ఏలుతున్నారు. 70 ఏళ్ల వయసులో తగ్గేది లేదంటున్నాడు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు.