
బుధవారం (జనవరి 22న) కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. జోస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని, మెన్ ఇన్ బ్లూ 43 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు, అతని ఓపెనింగ్ భాగస్వామి సంజు శాంసన్ 20 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ వేసిన ఒకే ఓవర్లో 22 పరుగులు బాదడం ద్వారా శాంసన్ పరుగుల వేటకు ఊపునిచ్చాడు. వీరిద్దరికి తోడుగా ఇతర ప్లుేయర్లు రాణించడంతో టీమిండియా 12.5 ఓవర్లలో 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ 16 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ
అయితే, ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, కలకత్తాలో జరిగిన తొలి టీ20లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్లేయింగ్ XI నుండి మినహాయించడం చర్చనీయాంశంగా మారింది. గాయం కారణంగా ఏడాది పాటు విరామం తర్వాత షమీ భారతజట్టులోకి తిరిగి వచ్చాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్న ఈ సీనియర్ స్టార్ పేసర్ను చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత ప్లేయింగ్ XIని ప్రకటించినప్పుడు, జాబితాలో షమీ పేరు లేదు. కలకత్తాలో జరిగిన టీ20 సిరీస్ ప్రారంభ మ్యాచ్లో అతన్ని జట్టు నుండి ఎందుకు మినహాయించారో సూర్యకుమార్ చెప్పలేదు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో మహ్మద్ షమీని ప్లేయింగ్ XIలో ఎందుకు చేర్చలేదు?
షమీని ప్లేయింగ్ 11లోకి ఎందుకు తీసుకోలేదు?
మొదటి టీ20కి మహ్మద్ షమీని మినహాయించాలనే నిర్ణయంపై ఓపెనర్ అభిషేక్ శర్మ స్పష్టత ఇచ్చాడు. ఈడెన్ గార్డెన్స్లో మంచి పరిస్థితులు, కాంబినేషన్ కారణంగా అతన్ని చేర్చలేదని పేర్కొన్నాడు.
“ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇది మంచి ఎంపిక అని వారు భావించారు” అని అభిషేక్ మ్యాచ్ అనంతరం మీడియాతో అన్నారు.
గంభీర్ వచ్చిన తర్వాత ఆటగాళ్ల ఎంపికలో మారిన పరిస్థితులు
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయినప్పటి నుండి, ముఖ్యంగా టీ20ల్లో ప్లేయింగ్ XIలో ఆటగాళ్ల ఎంపికలో మార్పు వచ్చింది. స్టార్ కల్చర్ కంటే పరిస్థితుల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడంపై గంభీర్ ఎక్కువగా దృష్టి సారించారు.
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో, టీమ్ ఇండియా యాజమాన్యం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ అనే ముగ్గురు స్పిన్నర్లను, ఒక స్పెషలిస్ట్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేసింది. ఈ కాంబినేషన్ బెడిసికొట్టలేదు, ఎందుకంటే ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది.
షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా?
కాగా, టీమిండియా నెట్స్ సెషన్ల సమయంలో మహ్మద్ షమీ ఎడమ మోకాలికి బ్యాండేజ్ కట్టుకుని కనిపించడంతో టీమ్ ఇండియా యాజమాన్యం అతని గాయం నుండి కోలుకోవడంపై పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలిసింది. 34 ఏళ్ల షమీ సైడ్ నెట్స్లో దాదాపు అరగంట పాటు బౌలింగ్ చేసి స్టంప్లను టార్గెట్ చేశాడు.
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ ప్రారంభ మ్యాచ్కు ముందు అన్ని నెట్స్ సెషన్లలో పూర్తి వేగంతో బౌలింగ్ చేసిన తర్వాత మోకాలి వాపు అతనికి ఇబ్బంది కలిగిస్తుందా అనేది మహ్మద్ షమీని ప్లేయింగ్ XI నుండి మినహాయించడం గురించి మరో ప్రశ్న.
జనవరి 25, శనివారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుతో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లోని రెండో టీ20కి ఈ అనుభవజ్ఞుడైన పేసర్ను షమీని ఎంపిక చేస్తారో లేదో చూడాలి.