ఓడిపోయిన ప్రతీసారీ ఫిక్సింగ్ అనకండి! పరువు పోతోంది... ఫ్యాన్స్‌కి షోయబ్ అక్తర్ వార్నింగ్..

First Published Sep 14, 2023, 5:52 PM IST

టీమిండియాపై గెలిచిన ప్రతీసారీ భారత జట్టును ట్రోల్ చేస్తూ సంబరాలు చేసుకునే పాకిస్తాన్ క్రికెట్‌ ఫ్యాన్స్, పాక్ టీమ్ ఓడిపోతే మాత్రం ఫిక్సింగ్ అంటూ ప్రతీ చిన్న విషయాన్ని సాకుగా చూపిస్తారు. టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి తర్వాత కూడా ‘ఫిక్సింగ్’ ట్రెండింగ్‌లో నిలిచింది..

India vs Pakistan

ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్, టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్, బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి, 228 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..

దీంతో చాలామంది పాక్ క్రికెట్ ఫ్యాన్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాస్ గెలిచిన తర్వాత కూడా టీమిండియాకి బ్యాటింగ్ ఇవ్వడానికి కారణం ఇదేనని అంటున్నారు... 

‘ఫ్యాన్స్ ఎందుకు ఇంత పిచ్చిగా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇండియా మ్యాచ్‌ని ఫిక్స్ చేసిందని నాకు చాలా మీమ్స్, మెసేజ్‌లు వచ్చాయి. అంతేకాకుండా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కావాలని ఓడిపోవాలని చూస్తోందని కూడా మెసేజ్‌లు చేశారు..

శ్రీలంక చేతుల్లో భారత జట్టు ఓడిపోతే, పాకిస్తాన్ ఛాన్సులు తగ్గుతాయి. అందుకే టీమిండియా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారని చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఇలా చేయడం కరెక్టేనా? శ్రీలంక బౌలింగ్ చూశారా? 

వెల్లలాగే, అసలంక వేసిన బౌలింగ్ చూసి, నాకే ఆశ్చర్యమేసింది. 20 ఏళ్ల కుర్రాడు ఇలా ఆడతాడని నేనైతే అనుకోలేదు. 5 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లోనూ 43 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌ వాళ్లే కాదు, ఇండియా నుంచి చాలా మంది నాకు ఫోన్ చేసి.. భారత జట్టు కావాలని ఓడిపోవాలని చూస్తోందని అన్నారు..

అసలు భారత జట్టు ఎందుకని ఓడిపోవాలని అనుకుంటుంది. వాళ్లు ఫైనల్‌కి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నవాళ్లే ఇలాంటి పిచ్చి పిచ్చి మీమ్స్ చేస్తారు. భారత జట్టు ఆడిన విధానం అద్భుతం..

చేసింది తక్కువ స్కోరు అయినా కుల్దీప్ యాదవ్‌ని చక్కగా వాడుకున్నారు. జస్ప్రిత్ బుమ్రా అదరగొట్టాడు. వెల్లలాగే ఆట అయితే నాకు తెగ నచ్చేసింది. ఆ 20 ఏళ్ల కుర్రాడు ఆడినట్టు కూడా మన టీమ్ ఆడలేకపోయింది...
 

మన ఫాస్ట్ బౌలర్లు వరుసగా మ్యాచులు ఆడలేరు. షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్, నసీం షా గాయపడకుండా 10 ఓవర్లు వేయాలని మనం అనుకుంటాం. కానీ టీ20లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు, వన్డేల్లో 10 ఓవర్లు ఎలా వేయగలరు? 
 

India vs Pakistan

మన తప్పిదాల వల్లే మనం చిత్తుగా ఓడిపోయాం. దాన్ని ఒప్పుకోవాల్సిందే.. ఓడిపోయిన ప్రతీసారీ ఫిక్సింగ్ అనకండి. మన పరువే పోతుంది. మన టీమ్ బాగుంటే ఎవ్వరి మీద ఏడవాల్సిన పని లేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. 

click me!