చెన్నై సూపర్ కింగ్స్ ను విజయవంతంగా నడిపించిన ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని.. వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఆడతాడా...? ఒకవేళ జట్టుతో ఉంటే ప్లేయర్ గా ఉంటాడా లేక కోచింగ్ సిబ్బంది రూపంలోనా..? ఐపీఎల్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్.
చెన్నై-ముంబై మధ్య గురువారం ముగిసిన మ్యాచ్ లో ధోని ఆటను చూశాక టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఆటతీరు చూస్తే అతడు వచ్చే సీజన్ లో ఆడటం పక్కా అని వ్యాఖ్యానించాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ముంబైతో మ్యాచ్ లో మీరు ధోని ఆడిన తీరును గమనించండి. వికెట్ల మధ్య కుర్రాళ్ల కంటే వేగంగా పరుగెత్తుతున్నాడు. ఆట పట్ల అతడికి ఇంకా ఆసక్తిగా, పాత ఉత్సాహంతోనే ఉన్నాడని స్పష్టంగా కనిపిస్తున్నది...
సాధారణంగా ఒక మ్యాచ్ లో బ్యాటర్ క్రీజులో ఉండి.. అవతలి ఎండ్ లో 8, 9వ నెంబర్ ఆటగాడు ఉంటే వాళ్లకు బ్యాటింగ్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరు. తామే క్రీజులో ఉండి మిగిలిన పనిని పూర్తి చేస్తారు. కానీ మీరు ధోనిని చూడండి. అతడు ఆఖరి బ్యాటర్ క్రీజులో ఉన్నా వికెట్ల మధ్య పరుగెత్తుతున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు..
ఆట పట్ల అతడికి ఉన్న అంకితాభావం గురించి అంతకంటే ఇంకా ఏం వివరించగలం...’ అని అన్నాడు. ధోని వచ్చే ఏడాది ఆడతాడని, అతడి ఆటతీరు కూడా అదే చూపిస్తున్నదని సన్నీ తెలిపాడు.
ఇక ముంబైతో మ్యాచ్ లో 17 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన వేళ బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. ఇన్నింగ్స్ చివరివరకు నిలిచి నాటౌట్ గా ఉన్నాడు. 33 బంతులాడి 36 పరుగులు చేశాడు.
అతడికి సహకారం అందించేవాళ్లు లేకపోవడంతో చెన్నై.. 16 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ధోని రాణించకుంటే చెన్నై ఆ మాత్రం స్కోరు కూడా చేయకపోయేది.