ఆ ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలు బంద్ :
ప్రస్తుతం చాలా ఆర్థిక లావాదేవీలు ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. భారీగా ఆర్థిక లావాదేవీలుంటూనే బ్యాంకుకు వెళ్లడం లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. మిగతా లావాదేవీల కోసం యూపిఐ ఆధారితంగా పనిచేసే ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడుతున్నారు. కూరగాయల బండి నుండి లగ్జరీ హోటల్స్ వరకు ప్రతిచోట ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ఉపయోగించే సౌకర్యం ఉంది. కాబట్టి చాలామంది డబ్బులను వెంటపెట్టుకెళ్లడం మరిచిపోయారు... పేమెంట్స్ యాప్ నే ఉపయోగిస్తున్నారు.
ఇలా ఆన్ లైన్ లోనే ఆర్థిక లావాదేవీలు పెరిగిపోవడం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన అకౌంట్లోని డబ్బులు కొట్టేసే ముఠాలు పెరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
చాలాకాలంగా ఉపయోగించని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలు నిలివేయాలంటూ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుండి యాక్టివ్ లో లేని లేదా ఎక్కువకాలం వాడకుండా ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ పేమెంట్ సేవలను నిలిపివేయనున్నాయి బ్యాంకులు. ఆర్థిక మోసాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది ఎన్పిసిఐ.
చాలాకాలంగా ఉపయోగించకుండా ఉండే ఫోన్ నంబర్లను ఇన్ యాక్టివ్ చేస్తాయి సర్వీస్ ప్రొవైడర్స్. తర్వాత ఇదే ఫోన్ నంబర్ ను మరో కస్టమర్ కు కేటాయిస్తాయి. దీంతో గతంలో ఈ నెంబర్ ద్వారా ఉపయోగించిన యూపిఐ సేవలు వారి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బ్యాంక్ లావాదేవీల వివరాలు, ఓటిపిలు కూడా వేరేవారి చేతిలోకి వెళతాయి. దీంతో మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు.