పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణ మాసంలో అత్యధిక శాతం మహిళలు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు ఆచరిస్తారు. దీనివల్ల మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇంట్లో కూడా వండేందుకు ఇష్టపడరు. దీనివల్ల మార్కెట్లలో చికెన్ వినియోగం భారీగా తగ్గిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. మార్చి నెల నుంచి ఎండల తీవ్రత, కోళ్ల దాణా ధరలు పెరిగిపోవడం, పెరిగిన డిమాండ్ కారణంగా బ్రాయిలర్ చికెన్ ధరలు దాదాపు కిలో రూ. 300 దాటాయి. అయితే శ్రావణ మాసం రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, మార్కెట్లో మాంసం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి.