168 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?

First Published Oct 27, 2024, 11:39 AM IST

మీకు తెలుసా..? ఇండియాలో ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్న అత్యంత పురాతనమైన రైల్వే స్టేషన్ ఏమిటో? ఆ స్టేషన్ నిర్మించి ఇప్పటికి 168 సంవత్సరాలైంది. దీని తర్వాత నిర్మించిన కొన్ని నిర్మాణాలు శిథిలమైపోయాయి. కాని ఈ స్టేషన్ మాత్రం చెక్కుచెదరలేదు. ఈ స్టేషన్ నుంచి ఇప్పటికీ రోజూ అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ స్టేషన్ ఎక్కడుంది. ఏ రాష్ట్రంలో ఉంది. దాని ప్రాముఖ్యత ఏమిటి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 
 

ఇండియన్ రైల్వేస్ దేశంలో 1951లో ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 42 వేర్వేరు రైల్వే కంపెనీలు కలిసి ఇండియన్ రైల్వేస్ ఏర్పడ్డాయి. అయితే అంతకు ముందే దేశంలో ట్రైన్ ట్రాన్స్ పోర్ట్ ఉంది. వీటిని బ్రిటీష్ పాలకులు ప్రారంభించారు. దేశాన్ని పరిపాలించే విషయంలో వచ్చే ట్రాన్స్ పోర్ట్ సమస్యలు అధిగమించాలని అప్పటి బ్రిటీష్ పాలకులు దేశ వ్యాప్తంగా రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే కేవలం ఆంగ్లేయులు మాత్రమే ఉపయోగించాలన్న ప్రతిపాదనతో రైల్వే లైన్లు ప్రారంభమైనప్పటికీ ప్రజల వ్యతిరేకతతో అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. అప్పటికే స్వాతంత్య్ర పోరాటాలు ప్రారంభం కావడంతో రైల్వే లైన్ల ఏర్పాటుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.  

బ్రిటీష్ కాలంలోనే ఇండియాలో రైల్వే లైన్స్ ప్రారంభమయ్యాయి. 1832లో భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని చెన్నైలో నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. 1835లో మద్రాస్‌లోని రెడ్ హిల్స్, చింతాద్రిపేట్ మధ్య రైల్వే ట్రాక్ నిర్మించారు. 1837లో దీన్ని ప్రారంభించారు. ఈ ట్రైన్ కోసం ఇంగ్లండ్ నుండి రోటరీ స్టీమ్ ఇంజన్ ను తెప్పించి దీన్ని నడిపారు. ఈ ట్రైన్ ను గ్రానైట్ రవాణాకు ఉపయోగించారు.

1854లో తూర్పు భారతదేశపు మొదటి ప్యాసింజర్ రైలు కోల్‌కతా సమీపంలోని హౌరా నుండి హూగ్లీ వరకు నడిపారు. చెన్నై సమీపంలోని రాయపురం, ఆర్కాట్ మధ్య దక్షిణ భారత దేశానికి చెందిన మొదటి ప్రధాన లైను నిర్మాణం 1853లో ప్రారంభమైంది. ఇది 1 జూలై 1856న ప్రారంభించారు. అదేవిధంగా మొట్టమొదటి ఆవిరితో నడిచే రైలును 1837లో చెన్నైలో నడిపారు. మొదటి ప్యాసింజర్ రైలును 1853లో ముంబై-థానే మధ్య నడిపారు. అలాగే 1925లో మొదటి ఎలక్ట్రిక్ రైలును  ముంబైలో ప్రారంభించారు. మొదటి లోకోమోటివ్ తయారీ యూనిట్ ను 1950లో చిత్తరంజన్‌లో ప్రారంభించారు. 1955లో మద్రాస్‌లో మొదటి కోచ్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
 

Latest Videos


భారత దేశంలో ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న అత్యంత పురాతనమైన స్టేషన్ పేరు రాయపురం రైల్వే స్టేషన్. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. ఇది భారతదేశంలో ఇప్పటికీ పనిచేస్తున్న అత్యంత పురాతన రైల్వే స్టేషన్. 

రాయపురం రైల్వే స్టేషన్ ను 1856లో నిర్మించారు. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో మొట్టమొదటి స్టేషన్. అంటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్. 1856 ఏప్రిల్ 28న ఈ స్టేషన్ నుంచి మొదటి రైలును చెన్నై నుండి ఆర్కాట్ పేట్టై వరకు నడిపారు. అప్పట్లో రాయపురం స్టేషన్ చెన్నై నుండి సుదూర ప్రాంతాలకు రైల్వే ప్రయాణాలు ప్రారంభించిన కేంద్రంగా ఉండేది. 
 

రాయపురం రైల్వే స్టేషన్‌ను బ్రిటీష్ పాలకులు నిర్మించారు. ఇది ముంబైలోని బోరీ బందర్ స్టేషన్ తరువాత ఏర్పాటు చేసిన రెండవ రైల్వే స్టేషన్. అయితే దేశం మొత్తం మీద ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్న పురాతన రైల్వే స్టేషన్ ఇదే కావడం విశేషం. అప్పట్లో ఇది మద్రాస్ రైల్వే నెట్‌వర్క్ ప్రధాన కేంద్రంగా ఉండేది. అప్పటి కాలంలో ఈ స్టేషన్‌ నిర్మాణం చాలా అద్భుతంగా నిర్వించారు. ఈ రైల్వే స్టేషన్ ను అప్పటి బ్రిటీష్ పాలకులు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి నిర్మించారు. 
 

రాయపురం రైల్వే స్టేషన్ ఇప్పటికీ తమిళనాడు లోని చెన్నైలో పనిచేస్తోంది. చెన్నై నగరానికి ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ కాలానుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్,  చెన్నై సెంట్రల్ పెద్ద స్టేషన్లుగా మారాయి. ప్రస్తుతం రాయపురం స్టేషన్ కేవలం ప్రాంతీయ రైళ్లకు సేవలందిస్తోంది. ఇది ప్రధానంగా సబర్బన్ రైలు సర్వీసులకు ఉపయోగపడుతోంది.

రాయపురం రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలో మొదటి రైలు సర్వీసు ప్రారంభమైన స్టేషన్ గా రికార్డుల్లో నిలిచింది. ఇది చెన్నై రైల్వే చరిత్రలో, చెన్నై పారిశ్రామిక అభివృద్ధిలో  కీలక పాత్ర పోషించింది. వందల సంవత్సరాలు పూర్తయినా ఈ స్టేషన్ తన చారిత్రక వైభవాన్ని కొనసాగిస్తోంది.

click me!