
కొత్త సంవత్సరం 2026 రాకముందే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సూపర్ గుడ్ న్యూస్ చెబుతూ అదరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు శుక్రవారం ఒక సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ను లాంచ్ చేసింది. ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తూ, తక్కువ ధరలో ఎక్కువ డేటాను కోరుకునే వారి కోసం ఈ ప్లాన్ను తీసుకొచ్చింది.
ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏడాది పొడవునా రీఛార్జ్ ఇబ్బంది లేకుండా హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్ మొత్తం ఖర్చును రోజువారీగా లెక్కగడితే, వినియోగదారుడికి అయ్యే ఖర్చు కేవలం 8 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. ఈ ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర బెనిఫిట్స్, బోనస్ ఆఫర్లు గమనిస్తే..
బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 2,799. ఇది ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్. వాలిడిటీ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 365 రోజుల (ఒక సంవత్సరం) పాటు సేవలు అందుతాయి. రోజుకు ఏకంగా 3GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే ఏడాదికి మొత్తం 1095GB డేటా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
కాలింగ్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా లభిస్తుంది. అలాగే, రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, వీడియో స్ట్రీమింగ్ ఎక్కువగా చేసేవారికి ఈ ప్లాన్ ఒక గొప్ప వరంగా మారుతుందని చెప్పవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే రూ. 2,399 వార్షిక ప్లాన్ను అందిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన రూ. 2,799 ప్లాన్కు, పాత ప్లాన్కు మధ్య చిన్నపాటి తేడా ఉంది. రూ. 2,399 ప్లాన్ లో రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్ 365 రోజుల పాటు లభిస్తాయి. ఇక రూ. 2,799 ప్లాన్ లో రోజుకు 3GB డేటా లభిస్తుంది. అంటే, మీరు అదనంగా రూ. 400 చెల్లించడం ద్వారా సంవత్సరం మొత్తం మీద 365GB అదనపు డేటాను పొందుతారు. దీనిని లెక్కగడితే, ప్రతి అదనపు 1GB డేటాకు మీరు చెల్లించేది కేవలం రూ. 1.10 మాత్రమే. కాబట్టి, ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి కొత్త ప్లాన్ చాలా లాభదాయకంగా ఉంటుంది.
కేవలం కొత్త ప్లాన్ మాత్రమే కాకుండా, న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్బంగా బీఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్లపై కూడా అదనపు డేటా ఆఫర్లను ప్రకటించింది. రూ. 2,399 ప్లాన్ ఆఫర్ విషయానికి వస్తే.. డిసెంబర్ 15, 2025 నుండి జనవరి 31, 2026 మధ్యలో ఎవరైతే రూ. 2,399 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటారో, వారికి సాధారణంగా వచ్చే 2GB బదులుగా రోజుకు 2.5GB డేటా లభిస్తుంది.
స్వల్పకాలిక ప్లాన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. రూ. 225, రూ. 347, రూ. 485 ప్లాన్లపై రీఛార్జ్ చేసుకుంటే, రోజుకు అదనంగా 0.5GB డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే ఉంటుంది.
కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ మరొక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది, అదే క్రిస్మస్ బొనాంజా. దీని ద్వారా కొత్తగా బీఎస్ఎన్ఎల్ లో చేరేవారు కేవలం రూ. 1 చెల్లించి 30 రోజుల పాటు సేవలను పొందవచ్చు. ఇందులో మీకు ఉచిత సిమ్ కార్డు, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటా అభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఈ ఏదాడి డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రస్తుతం టెలికాం రంగంలో టారిఫ్ ధరలు పెరుగుతున్న తరుణంలో, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ తక్కువ ధర ప్లాన్లు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. ఈ కొత్త రూ. 2,799 ప్లాన్, ఇతర ఆఫర్లు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్, 'బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్' యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అలాగే పేటీయం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe) వంటి ఇతర రీఛార్జ్ ప్లాట్ఫారమ్లలో కూడా ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.
దేశవ్యాప్తంగా 4G సేవలను విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్, 2026లో మరిన్ని అధునాతన సేవలతో వినియోగదారుల ముందుకు రానుందని ఈ ఆఫర్ల ద్వారా స్పష్టమవుతోంది. ఎక్కువ డేటా, తక్కువ ధర కోరుకునే వారు వెంటనే ఈ ప్లాన్లపై ఒక కన్నేయండి మరి !