AP Mega DSC 2026: మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. నిజంగానే పెద్ద స్కామా?

Published : Sep 10, 2026, 01:18 PM IST

AP Mega DSC 2026: ఏపీ డీఎస్సీ భర్తీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

PREV
15
డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు పట్టుబట్టిన మాజీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల భర్తీ ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని ఆయన విమర్శించారు.

25
స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నలు

స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన 372 పోస్టుల భర్తీ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఎలాంటి పోటీలు నిర్వహించకుండానే కొన్ని క్రీడా విభాగాల్లో విజేతలైనట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. జూడో పోటీలు జరగలేదని సంబంధిత అసోసియేషన్ ప్రతినిధులే చెబుతున్నప్పటికీ, ఆ విభాగంలో అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఎలా లభించాయని నిలదీశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు.

35
జీవోల మార్పు, నిబంధనల విధింపు

గతంలో ఉన్న క్రీడల కోటాను సవరించేందుకు జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారని, నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్లీ జీవో నంబర్ 23, 25, 56 ద్వారా నిబంధనలను మార్చారని జగన్ అన్నారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయకుండా, నకిలీ పత్రాలు ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.

45
మెరిట్ లిస్ట్, అభ్యర్థుల లాగిన్ వివాదం

పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలను ఒకే వ్యవస్థ లేదా వ్యక్తికి అప్పగించడం వల్ల పారదర్శకత లోపించిందని వైఎస్ జగన్ అన్నారు. ఎస్సీఈఆర్టీ విభాగంలో పనిచేసిన ఓ అభ్యర్థికి మొదటి ర్యాంక్ రావడం, ఆ తర్వాత మెరిట్ జాబితా నుంచి అతని పేరు మాయమవ్వడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సదరు అభ్యర్థి లాగిన్ బ్లాక్ చేయడం వల్ల అతను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని జగన్ గుర్తుచేశారు.

55
దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు డిమాండ్

క్రీడా సంఘాల అధ్యక్షులుగా ఉన్న ముఖ్య నేతల పేర్లను ప్రస్తావిస్తూ, తెలంగాణలోని ఖమ్మం వంటి ప్రాంతాల్లో జరగని పోటీల పేరిట రికార్డులు సృష్టించారని జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ విచారణను వేగవంతం చేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇతర ఉద్యోగాల భర్తీపై ప్రభావం

డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టిన నియామకాలపై కూడా ఈ వివాదాల ప్రభావం పడిందని జగన్ పేర్కొన్నారు. వ్యవస్థలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు నమ్మకం పోయేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories