
గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకటరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పోటీలో ఉంటారు. అయితే వేర్వేరు పార్టీల తరపున పోటీ చేయనున్నారు.యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరనున్నట్టుగా ఇవాళ ప్రకటించారు. దీంతో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2014లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావును తప్పించి వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు. కానీ, వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టారు.
2014, 2019లో వల్లభనేని వంశీ కారణంగా దాసరి బాలవర్ధన్ రావుకు టీడీపీ టిక్కెట్టు దక్కలేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని వల్లభనేని వంశీ రంగం సిద్దం చేసుకున్నారు. కానీ , 2009 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ సీటును వల్లభనేని వంశీకి ఇవ్వలేదు చంద్రబాబు. దాసరి బాలవర్ధన్ రావును ఈ స్థానం నుండి టీడీపీ బరిలోకి దింపింది. గన్నవరం నుండి దాసరి బాలవర్ధన్ రావు విజయం సాధించారు..వల్లభనేని వంశీని విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో వల్లభనేని వంశీ ఓటమి పాలయ్యారు. విజయవాడ పార్లమెంట్ నుండి కాకుండా గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు వల్లభనేని వంశీ ఆసక్తిని చూపారు.
2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావును కాదని వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు.2014 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వల్లభనేని వంశీ టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేసి విజయం సాధించారు. దాసరి బాలవర్ధన్ రావుకు నామినేట్ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అనేక కారణాలతో ఈ హామీని అమలు చేసుకోలేదు.
2019 ఎన్నికల సమయంలో దాసరి బాలవర్ధన్ రావు మరోసారి టిక్కెట్టు ఆశించారు. కానీ చంద్రబాబు వల్లభనేని వంశీకే టిక్కెట్టు ఇచ్చారు. దీంతో దాసరి బాలవర్ధన్ రావు 2019లో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు.
2019 లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు. యార్లగడ్డ వెంకటరావుపై స్వల్ప ఓట్ల మెజారిటీతో వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకి జై కొట్టారు.2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ గన్నవరం నుండి పోటీ చేయనున్నారు. తనకు టిక్కెట్టు ఇవ్వాలని యార్లగడ్డ వెంకటరావు బహిరంగంగానే పార్టీ నాయకత్వాన్ని కోరారు. కానీ పార్టీ నాయకత్వం నుండి ఆశించిన స్పందన లేదని యార్లగడ్డ వెంకటరావు వర్గీయులు చెబుతున్నారు.
దీంతో గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీగా అర్జునుడిని చంద్రబాబు నియమించారు. అయితే అనారోగ్య కారణాలతో అర్జునుడు మృతి చెందారు. దీంతో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీ కోసం టీడీపీ నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు టీడీపీకి దగ్గరయ్యారు. మరో వైపు వైసీపీలో పరిణామాల నేపథ్యంలో యార్లగడ్డ వెంకటరావు కూడ ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
ఈ పరిణామాలను గమనించిన టీడీపీ నాయకత్వం యార్లగడ్డ వెంకటరావుకు గాలం వేసింది.
గతంలో గన్నవరంలో నిర్వహించిన టీడీపీ సమావేశంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఐ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో యార్లగడ్డ వెంకటరావు వైసీపీని వీడుతారని ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ ప్రచారాన్ని యార్లగడ్డ వెంకటరావు కొట్టిపారేశారు.
కానీ ఈ నెల 13న గన్నవరంలో అనుచరులతో యార్లగడ్డ వెంకటరావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్టివ్వాలని కోరారు. కానీ ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో ఇవాళ మరోసారి విజయవాడలో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు.ఇవాళ జరిగిన తన అనుచరుల సమావేశంలో చంద్రబాబును అపాయింట్ మెంట్ ఇవ్వాలని యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. టీడీపీలో చేరనున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు.
అయితే ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఈ నెల 14న దాసరి బాలవర్ధన్ రావు భేటీ అయ్యారు.ఈ భేటీ తర్వాత యార్లగడ్డ వెంకటరావు చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకటరావు టీడీపీ అభ్యర్దిగా బరిలోకి దిగనున్నారు.