Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నిర్వహించిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని చంద్రబాబు తెలిపారు. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ను ఆదివారం సీఎం పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి ఆయనను వ్యక్తిగతంగా కలిశారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన సతీమణి అన్నా కొణిదలతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల బృందంతో కూడా సమావేశమై చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, మంత్రి అనగాని సత్యప్రసాద్, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కూడా ఆస్పత్రిలో ఉన్నారు.
25
మూడున్నర గంటల పాటు సాగిన శస్త్రచికిత్స
పవన్ కళ్యాణ్ కుడి భుజానికి దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేక వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. చాలాకాలంగా ఉన్న భుజం గాయాన్ని ప్రజా కార్యక్రమాల కారణంగా ఆయన నిర్లక్ష్యం చేయడంతో సమస్య తీవ్రత పెరిగిందని వైద్యులు గుర్తించినట్లు సీఎం తెలిపారు. ఇటీవల వైద్య పరీక్షల్లో గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని, ప్రస్తుతం శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమై పవన్ కోలుకుంటున్నారని వెల్లడించారు.
35
మూడు వారాల ఫిజియోథెరపీ.. ఆరు నెలల తర్వాత మరో పరీక్ష
శస్త్రచికిత్స అనంతరం కనీసం మూడు వారాల పాటు విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ తప్పనిసరిగా కొనసాగించాలని వైద్యులు సూచించినట్లు చంద్రబాబు చెప్పారు. భుజం పూర్తిగా కోలుకోవడానికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎడమ భుజానికీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని చెప్పారు. కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత సుమారు ఆరు నెలల అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించి, ఎడమ భుజానికి శస్త్రచికిత్స అవసరమా లేదా ఫిజియోథెరపీతోనే సమస్య పరిష్కారమవుతుందా అనేది నిర్ణయిస్తారని వివరించారు.
ఏళ్లుగా ప్రజల మధ్య పర్యటిస్తూ, నిరంతరం కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోలేదని సీఎం పేర్కొన్నారు. పర్యటనల సమయంలో అభిమానులు ఆప్యాయంగా చుట్టుముట్టడం, చేతులు పట్టుకుని లాగడం, తోపులాటలు జరగడం వంటి కారణాలతో భుజాలపై ఒత్తిడి పెరిగి గాయాలు మరింత తీవ్రతరమయ్యాయని తెలిపారు. అయినా ప్రజా సేవకు ప్రాధాన్యం ఇచ్చి చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారని, చివరకు వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారని చెప్పారు.
55
త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల్లోకి వస్తారు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, కోలుకునే ప్రక్రియ సానుకూలంగా సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. వైద్యులు సూచించిన విశ్రాంతి, ఫిజియోథెరపీ పూర్తి అయిన తర్వాత ఆయన మునుపటి ఉత్సాహంతోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరోగ్యాన్ని పూర్తిగా కుదుటపడే వరకు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కూడా సీఎం సూచించినట్లు తెలిపారు.