
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును ప్రజల మధ్యలో జరుపుకున్నారు. ఇలా 73వ వసంతంలోకి అడుగుపెట్టిన వెంటనే మరోసారి టిడిపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. ఇప్పటినుండే నిత్యం ప్రజాక్షేత్రంలో వుంటూ వైసిపి పాలన ఎలా సాగుతుందో వారికి వివరించాలనుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా పుట్టిన రోజు నుండే ఆ పని ప్రారంభించారు. ఇందులోభాగంగానే బుధవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెంలో చంద్రబాబు పర్యటించారు.
గ్రామస్తులతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తల సమక్షంలో భర్త్ డే కేక్ కట్ చేసారు చంద్రబాబు. అనంతరం గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనం చేసారు. ఈ సందర్భంగా తన పక్కన కూర్చున్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడుతూ భోంచేసారు చంద్రబాబు. అనంతరం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా, వైఫల్యాల కారణం గా తాము ఎలా నష్టపోయామో వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబుకు తెలిపారు. దళిత వర్గానికి చెందిన తనకు గత టిడిపి ప్రభుత్వం ద్వారా ఎలా లబ్ధి జరిగిందో ఉదయ్ కుమార్ అనే యువకుడు వివరించాడు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... విద్యతోనే యువత జీవితాల్లో మార్పు వస్తుందని తాను నమ్ముతానని అన్నారు. సాంకేతిక విద్యకు నాడు టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంతోనే యువతకు విస్తృతం అవకాశాలు వచ్చాయన్నారు.
ప్రస్తుత వైసిపి పాలనలో రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. గత ఎన్నికల సమయంలో రైతుకు జగన్ ఇస్తాను అన్నది ఎంత.....ఇస్తుంది ఎంత? అని ప్రశ్నించారు. చివరకు కేంద్రం రైతుకు ఇచ్చే సొమ్మును కూడా తానే ఇస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
''పొరుగున వున్న తెలంగాణలో రైతుల మోటార్లకు వద్దన్నారు... మరి జగన్ ఎందుకు ఏపీలో అంగీకరించారు. గతి లేని రైతులే వరి పంట వేస్తున్నారని మంత్రి ఎలా అంటారు? వరిసాగు మానేస్తే ఈ వైసీపీ వాళ్ళు గడ్డి తినాలి. రైతులు భయపడాల్సిన పని లేదు...కేసులు, బెదిరింపులకు భయపడకండి. అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ లాంటివారిని జైల్లో పెట్టి ఏమి చెయ్యగలిగారు'' అంటూ రైతులకు ధైర్యం చెప్పారు.
''చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే తెలుగుదేశం రావాలి. పోలవరం ప్రాజెక్ట్ ను 2020 నాటికి పూర్తి చెయ్యాలని పని చేసాము. ఇప్పుడు రివర్స్ టెండర్లతో పోలవరాన్ని నాశనం చేశారు. పోలవరంలో అవినీతిని ఏమి తెల్చలేక పోయారు. పోలవరం పనులు నిలిపివేయడం వల్లనే కాఫర్ డ్యాం దెబ్బతింది. చేతగాని దద్దమ్మ వల్ల ఇప్పుడు పోలవరం కష్టాన్ని బూడిద లో పోసిన పన్నీరు చేశారు. నదుల అనుసందానం కోసం కలలు కన్నాను....ఇరిగేషన్ సర్వనాశనం చేశారు'' అని మండిపడ్డారు.
''నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు... నా ఆలోచన నాకోసం కాదు...రాష్ట్రం కోసమే నా తపన. ప్రభుత్వ అప్పుల్లో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? నాడు జుట్టు మీద పన్ను వేసినట్లు...ఇప్పుడు చెత్తమీద పన్ను వేశారు. వీరి బాదుడు పై నేను రాష్ట్ర వ్యాప్తం గా తిరుగుతూ...ప్రజలను చైతన్య పరుస్తా? జగన్ తప్పులకు జనం ఆత్మహత్యలు చేసుకోవడం కాదు...వైసీపీకి ఉరెయ్యాలి'' అని చంద్రబాబు మండిపడ్డారు.
''రాష్ట్రం లో ఎప్పుడు చూసినా బాదుడే బాదుడు....ఆక్వా రైతులు కూడా తీవ్రం గా నష్టపోయారు. ప్రభుత్వ బాదుడు పై ప్రజలు ప్రశ్నించాలి. జగన్ ప్రభుత్వంలో ధర పెరగని ఒక్క వస్తువు ఉందా? భారతి సిమెంట్ ధర 400 రూపాయలు పెరిగింది. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు'' అని మండిపడ్డారు.
''మద్యం షాప్స్ లో సొమ్ము ఎక్కడికి పోతుంది? మద్యం పై j టాక్స్ తో జగన్ దోపిడీ చేస్తున్నారు. మాటలు చెప్పిన సన్నబియ్యం పోయింది....ఇప్పుడు ఉన్న బియ్యం పోతుంది. 40 రూపాయల బియ్యానికి 12 రూపాయలు ఇస్తాం అని కార్డ్ దారులకు చెపుతున్నారు'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.
''రాష్ట్రం లో 7.75 లక్షల కోట్ల అప్పులు చేశారు...ఇవన్నీ వైసీపీ వాళ్ళు కడతారా? వైసీపీ పాలనతో రాష్ట్రం మరో శ్రీలంక అయ్యే పరిస్థితి వస్తుంది. జగన్ ఒక కుటుంబానికి ఎంత ఇచ్చాడో...ఎంత అప్పుల భారం మోపారో చెప్పాలి?'' అని చంద్రబాబు నిలదీసారు.