గ్రామాల్లో పాలన ఎలా వుండనుందంటే...
ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై తాజా సమీక్షలో పవన్ అధికారులతో చర్చించారు.
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై పవన్ చర్చించారు. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఇక గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారని పవన్ పేర్కొన్నారు.
కొత్త క్లస్లర్ వ్యవస్థపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని మంత్రి పవన్ నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పవన్ స్పష్టం చేసారు.
జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకొని ఈ కమిటీ నివేదిక రూపొందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. గ్రేడ్ల ఆధారంగా పంచాయతీ, సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారని పవన్ స్పష్టం చేసారు.