''జగనన్నా.. జనం ఓట్లేసి గెలిపిస్తే.. మీకిది భావ్యమేనా..?'' అంటూ నిలదీసింది షర్మిల. ''మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు భాధ్యత లేదా..? ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరని చెబుతున్నారు. మైకు ఇవ్వకపోవడం మీ స్వయంకృత అపరాధం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? మీ అక్రమాలను, అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా. 'అసెంబ్లీకి పోను..' అనడం మీ అహకారం, అజ్ఞానానికి నిదర్శనం. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి.
అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు ఆలోచన లేదా..? ప్రజలు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ వెళ్ళడానికి కదా. అసెంబ్లీకి పోకుంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా..? ప్రజలను మోసం చేసినట్లు కాదా..? జగన్కి అంటే అహంకారం ఉంది. మీకు ఏమయ్యింది. ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా ప్రజలు మీకు ఓట్లు వేసింది..? మీ అజ్ఞానం ఏంటో బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది భావ్యం కాదు. బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు..? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు..? సర్కార్ దందాలను ప్రశ్నించేది ఎవరు..? ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అసెంబ్లీకి పోను అని మీరు చెప్పారా..? మీకు దైర్యం, సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయండి.'' అంటూ జగనన్న విడిచిన బాణం ఆ జగనన్నపైనే లేఖాస్త్రం సంధించింది.
మీరు అసెంబ్లీకి వెళ్ళకుంటే రాజీనామాలు చేయండి. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలను లేవనెత్తండి అంటూ తన పార్టీ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేసేసింది....అయితే జగన్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత.. అది మారదు. అంటే షర్మిల ఎన్ని లేఖాస్త్రాలు సంధించినా.. జగన్ మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టడు కాక పెట్టడు. అంటే.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలే అధికార, ప్రతిపక్షాలన్న మాట.