
`మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యబాబులను టార్గెట్గా చేసుకుని సినిమా రంగంలోకి వచ్చానని చెప్పారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. టాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు కిరణ్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదుగుతూ వస్తున్నారు. `రాజావారు రాణిగారు`, `ఎస్ ఆర్ కళ్యాణమండపం` చిత్రాలతో ఒక్కసారిగా హీరోగా దూసుకొచ్చాడు. వరుస సినిమాలతో ఆడియెన్స్ ని బ్యాక్ టూ బ్యాక్ అలరిస్తున్నారు.
తాజాగా ఆయన `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో ఈ శుక్రవారం(సెప్టెంబర్ 16) ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తనకు మాస్, యాక్షన్ సినిమాలంటే ఇష్టమని చెప్పారు. చిన్నప్పట్నుంచి చిరంజీవి, బాలయ్యబాబులను చూసి పెరిగానని, వారిలా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేయాలని తనకు కోరికగా ఉండేదని, ఇప్పుడు తాను అదే దారిలో వెళ్తున్నట్టు చెప్పాడు కిరణ్.
తన ప్రతి సినిమాలో ప్యామిలీ అంతా కలిసి చూసే ఎంటర్టైన్ మెంట్ ఉండాలని, వ్యక్తిగతంగా తనకు అది అంటే ఇష్టమని చెప్పారు. అందుకే తాను సినిమాల ఎంపిక చేసుకునే టైమ్లోనే ఆ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. మొదట్లో తన సినిమాలు బాగా ఆడాలని, తాను నిలబడాలనే ఉద్దేశ్యంతో రైటింగ్స్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యానని, మళ్లీ `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రానికి రైటింగ్స్ సైడ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండనిపించి, అందుకే తాను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పారు.
ఈ సినిమాలో ఓ నలభై నిమిషాల పాటు యాక్షన్ ఎపిసోడ్ ఉందని, అది నెక్ట్స్ లెవల్లో ఉంటుందన్నారు. ఓవరాల్గా తనది ఫుల్ ఎంటర్టైనింగ్ రోల్ అని, ఈ చిత్రంతో ఆడియెన్స్ ని కచ్చితంగా ఆకట్టుకుంటాననే నమ్మకం ఉందన్నారు. కూతురు, తండ్రి మధ్య ఎమోషన్స్ ఈ సినిమాలో బలంగా ఉంటాయని, దాని చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు సినిమాలో మెయిన్ పాయింట్ గా ఉంటుందన్నారు.
తన గత సినిమాలు `సెబాస్టియన్` పెద్దగా ఆకట్టుకోలేదని, `సమ్మతమే` కమర్షియల్గా హిట్ అని చెప్పారు. కానీ `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` చిత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ చేయదని, సినిమా ఆసాంతం వినోదాత్మకంగా సాగుతుందని, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. అదే సమయంలో తన సినిమాల ద్వారా ఏదో ఒక పాయింట్ని చెప్పాలనేది తన ఉద్దేశ్యమని, ఆ పాయింట్ ఇందులో కూడా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా బిగ్ డైరెక్టర్ కోడి రామకృష్ణగారి కూతురు స్థాపించిన బ్యానర్లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని, మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయనతో పనిచేయడం ఓ డ్రీమ్లాంటిదన్నారు. సినిమాకి ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్ అని చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ని పవన్ కళ్యాణ్ విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉందని, ఆయన తన సినిమాని చూశానని చెప్పడం ఎగ్జైటింగ్గా ఉందన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ అని చెప్పారు కిరణ్.
నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, గీతా ఆర్ట్స్ లో `వినరో భాగ్యము విష్ణు కథ`, మైత్రి మూవీ మేకర్స్ లో `మీటర్` చేస్తున్నానని, ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయన్నారు. ఏ ఎం రత్నం బ్యానర్ లోని `రూల్స్ రంజన్` సినిమా నలభై శాతం షూటింగ్ పూర్తయ్యిందని, అలాగే దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాదిలోనే మరో సినిమా విడుదల కానుందని తెలిపారు.