
సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరొక అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని తయారుచేసింది. ఈ విగ్రహాన్ని ఈ నెల (మార్చి 25న ) హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ వేదికగా మహేష్ లాంచ్ చేయనున్నాడు. అనంతరం విగ్రహాన్ని సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.
అయితే ఈ సందర్భంగా మహేష్ అభిమానులకోసం మేడమ్ టుస్సాడ్ సింగపూర్ ఒక కాంటెస్ట్ ను తీసుకొచ్చింది. ఈ కాంటెస్ట్ లో గెలిస్తే మహేష్ తో సెల్ఫీ తో దిగొచ్చు. దానికి చేయవల్సింది ఏమిటీ అంటే.. మహేష్ బొమ్మను గీసి మేడమ్ టుస్సాడ్ సింగపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అందులో నుండి ఇద్దరు విజేతలు మహేష్ తో సెల్ఫీ దిగొచ్చు. మార్చి 21వ తేదీన ఈ కాంటెస్ట్ ముగియనుంది.
టుస్సాడ్స్ మ్యూజియం వారు ఒక విగ్రహాన్ని సింగపూర్లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేష్ బాబుకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమా చేస్తున్నాడు.