
పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు.. అందరికంటే ముందే సినిమా చూడాలనే ఆతురత అభిమానులలో ఉంటుంది. దానికి తగ్గట్లే కొన్నేళ్లుగా బెనిఫిట్ షోలను అమలులోకి తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ రోజు ఉదయం మూడు లేదా నాలుగు గంటల నుండే ఈ షోలు మొదలైపోతాయి. తమ అభిమాన హీరో సినిమా కోసం బెనిఫిట్ షో టికెట్ ఎంత పెట్టి కొనడానికైనా సిద్ధపడిపోతున్నారు అభిమానులు.
దీంతో ఈ బిజినెస్ కాస్త ఓ రేంజ్ లో జరిగేది. ఇది గమనించిన పోలీసులు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వడం మానేశారు. అభిమానులు అదుపు చేయలేకపోవడం, అనవసరమైన ట్రాఫిక్ ఇష్యూలు వస్తుండడంతో బెనిఫిట్ షోల ప్రస్తావన రానివ్వడం లేదు. ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలకు తెలంగాణా రాష్ట్రంలో స్పెషల్ షో పర్మిషన్ దొరకలేదు.
మరి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ చిత్రాలను పర్మిషన్లు దొరుకుతాయా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఏపీ చంద్రబాబు నాయుడు అండ ఉంది కాబట్టి అక్కడ ఎన్టీఆర్ బయోపిక్ బెనిఫిట్ షోలకు సమస్య ఉండదు. అలానే తెలంగాణాలో కూడా పర్మిషన్ కోసం ఈ చిత్ర దర్శకనిర్మాతలతో పాటు 'వినయ విధేయ రామ' మేకర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు.
దీనికోసం తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలవాలని అనుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ సభ్యులతి కేటీఆర్ కి మంచి బంధాలు ఉన్నాయి. జిహెచ్ఎంసి అధికారులు కేటీఆర్ గ్రిప్ లోనే ఉంటారు కాబట్టి వారి ద్వారా పోలీసుల పర్మిషన్ కి కేటీఆర్ ప్రయత్నించొచ్చు. ఈ కారణంగానే ఆయన్ని సంప్రదించడానికి ప్లాన్ చేస్తున్నారు.
పైగా కేటీఆర్ కి సినిమాల పట్ల ఆసక్తి కూడా ఉంటుంది. 'వినయ విధేయ రామ' సినిమా ఆడియో లాంచ్ కి అతిథిగా కూడా వచ్చారుకేటీఆర్. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు బెనిఫిట్ షోల పర్మిషన్ ఇవ్వాలి.. వద్దు అన్నది కేటీఆర్ చేతుల్లోనే ఉంది. మరి దీనికి ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి!