
ఈ సంవత్సరం మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజై తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా గామి. విశ్వక్ సేన్ (Vishwak Sen)ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ద్వారా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita)డైరక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ (Chandini Chowdary). ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమాలో విజువల్స్ హాలీవుడ్ స్దాయిలో ఉన్నాయంటూ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక చిత్రం థియేటర్ రన్ పూర్తైన నేపధ్యంలో సినిమా ఓటిటి రిలీజ్ కు ముస్తాబు అయ్యింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనుంది. ఈవిషయాన్ని మూవీ టీమ్తో పాటు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కథేంటంటే ?
అఘోరా అయిన శంకర్ (విశ్వక్ సేన్) మానవ స్పర్శను కూడా తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితోనూ ఇబ్బంది పడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతనిని శాపగ్రస్థుడుగా భావిస్తారు. ఆశ్రమం నుంచి కూడా వెలివేస్తారు. ఈ క్రమంలో అతడు తనని తాను తెలుసుకునేందుకు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లో ఉంటుందని తెలుసుకుంటాడు. అక్కడి ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది ఓ స్వామీజీ చెబుతారు. కానీ అక్కడికి చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటాలి. కానీ వాటిని లెక్క చేయకుండా డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి అతడు వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వెళ్లే దారిలో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు? మాలిపత్రాలు సాధించాడా? అసలు తానెవరో చివరికి తెలుసుకుంటాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.