
ఒక భాషలో హిట్టైన చిత్రాలను మరో భాషలోకి రీమేక్ చేయటం ఎప్పటినుంచో జరుగుతున్నదే. అయితే ఆ పాత్రకు తగ్గ నటుడుని ఎంచుకోవటం, నేటివిటి అద్దడం రీమేక్ కు అత్యవసరం. అయితే ఈ మధ్యన ఒరిజనల్స్ ఓటిటిలో దొరుకుతూండటంతో రీమేక్ ల జోలికి హీరోలు వెళ్లటం లేదు. కానీ ప్రక్క భాషలో హిట్టైన చిత్రం ఖచ్చితంగా రీమేక్ చేయాలనిపిస్తుంది. అలాంటిదే ఇప్పుడు మళయాళంలో రిలీజైన ఓ చిత్రం పై మన హీరోల దృష్టి పడింది. ఆ చిత్రంలో హీరో గా ఎవరు చేస్తారు..చేయబోతున్నారు..ఆ సినిమా ఏమిటి
మోహన్లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన మూవీ నేరు (Neru). డిసెంబర్ 21న థియేటర్లో రిలీజై దూసుకెళ్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ (JeethuJoseph) తెరకెక్కించారు. షారుఖ్ డంకీ, ప్రభాస్ సలార్ మూవీస్కి పోటీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. దృశ్యం సిరీస్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్..కొత్త జోనర్ని టచ్ చేస్తూ తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు నేరు మూవీ ఎవరు చేయబోతున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ‘నేరు’ సినిమా డబ్బింగ్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదట. ఈ సినిమా ఫలితం, కథ మీద నమ్మకంతో నిర్మాణ సంస్థ రీమేక్ కోసమే పక్కన పెట్టిందట. ప్రస్తుతం థియేటర్లో దూసుకెళ్తోన్న నేరు మూవీ డబ్బింగ్ రైట్స్ను ఎవ్వరు సొంతం చేసుకోలేదని సమాచారం.
వెంకటేష్కి బాగా సూట్ అవుతుందనే విషయాన్ని..డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్వయంగా ఓసారి చూడమని రిక్వెస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. సైంధవ్ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న వెంకటేష్..అతి త్వరలో తప్పకుండా నేరు సినిమా చూడబోతున్నారట. వెంకటేష్ కి కనుక సినిమా నచ్చితే..తప్పకుండ రీమేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.
మరో ప్రక్క ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నారట. వకీల్ సాబ్ 2 చిత్రంగా దీన్ని మలుద్దామనే ఆలోచన ఉందిట. ఇందులో పాటలు కూడా లేవు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ ఇమేజ్ కి ఈ కథ సరిపోతుందన్న అభిప్రాయం తెరపైకి వస్తోంది. 'వకీల్ సాబ్ 2' గా దీన్ని తెరపైకి తెస్తే బాగుంటుందంటున్నారు. అవసరం మేర పవన్ ఇమేజ్ కి కాస్త కమర్శియల్ టచ్ అప్ ఇవ్వొచ్చు. పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగల్గితే మంచి ఐడియా అవుతుందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి పీకే సాబ్ ఏమంటారా?
నేరు కాన్సెప్టు విషయానికి వస్తే... ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో..లాయర్ అయిన హీరో మోహన్ లాల్ ఈ కేసు కోసం ఎలా సహాయపడ్డాడు..అందుకు ఎదురయ్యిన అడ్డంకులు ఏంటీ అనే పాయింట్ తోనే ఈ సినిమా ఉంటుంది. కేవలం రెండు ఇళ్ళు- కోర్ట్ రూమ్ సెటప్ లోనే కథ నడిపించి సక్సెస్ కొట్టారు. కథ వింటే సింపుల్ గా..ఇప్పటికీ చాలా సినిమాల్లో తెలిసిన కథ అని అనిపించినా..దీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఇంటెన్స్ కోర్ట్ సీన్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.