వరుణ్ తేజ్కి వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు. దీనికి బదులు వైష్ణవ్ తేజ్ బలయ్యాడు.
వైష్ణవ్ తేజ్ ఇటీవల `ఆదికేశవ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఆయన నటించిన నాల్గో సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. రొటీన్ కమర్షియల్ మూవీ కావడంతో ఆడియెన్స్ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. శ్రీలీల కూడా ఉన్నా కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కడం గమనార్హం.
ఈ బ్యానర్లో సినిమాలంటే ఇటీవల మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఆడియెన్స్ లో ఏర్పడింది. కానీ `ఆదికేశవ` ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యాక నాగవంశీ ఇలాంటి సినిమాని ఎలా ఓకే చేశాడనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. మొత్తానికి మిస్టేక్ జరిగింది. ఈ ఏడాది వరుస హిట్లతో దూసుకుపోతున్న సితార బ్యానర్కి ఈ మూవీ బ్రేకులేసిందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం రివీల్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ మొదట వరుణ్ తేజ్ వద్దకి వెళ్లిందట. దర్శకుడు వరుణ్ తేజ్కి నెరేట్ చేశాడట. ఆయనతోనే సినిమా చేయాలనుకున్నారు. మొదట ఆల్మోస్ట్ ఓకే అనే దశకు వెళ్లారట. కానీ కారణం ఏంటో గానీ వరుణ్ తేజ్ మనసు మార్పుకున్నాడట. దీన్ని రిజక్ట్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ టెంప్ట్ అయ్యారు. సినిమా చేశాక గానీ ఇది తను చేయాల్సిన మూవీ కాదని ఆయనకు అర్థమై ఉంటుంది. నిర్మాతకు కూడా అర్థమై ఉంటుంది. అందుకే ప్రమోషన్స్ కూడా పెద్దగా యాక్టివ్గా చేయలేదు.
ఏదేమైనప్పటికీ ఇప్పటికే వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు వరుణ్ తేజ్, మరో ఫ్లాప్ నుంచి తెలివిగా తప్పించుకున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ బలయ్యాడు. `ఉప్పెన` చిత్రం తర్వాత వైష్ణవ్కి హిట్ లేదు. `కొండపొలం`, `రంగ రంగ వైభవంగా` చిత్రాలు పరాజయం చెందాయి. ఇప్పుడు `ఆదికేశవ`తో మరో డిజాస్టర్ పడింది. ఇలా `ఉప్పెన` వంటి హిట్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్ని చవిచూశాడు వైష్ణవ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ `ఆపరేషన్ వాలెంటైన్` చిత్రంలో నటించారు. ఇది వచ్చే వారం విడుదల కాబోతుంది.