హీరో విశాల్ ఇంటిపై దాడి... అద్దాలు ధ్వంసం!

By Sambi ReddyFirst Published Sep 28, 2022, 2:30 PM IST
Highlights

హీరో విశాల్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఇల్లు స్వల్పంగా ధ్వంసమైంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 
 


విశాల్ ఇంటిపై దాడి కోలీవుడ్ లో కలకలం రేపింది. కొందరు దుండగులు ఆయన నివాసంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో విశాల్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎర్ర కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు విశాల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. అనంతరం అదే కారులో అక్కడి నుండి పారిపోయారు. ఈ దాడి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇక దాడి సమయంలో విశాల్ ఇంట్లో లేరని సమాచారం. షూటింగ్ నిమిత్తం విశాల్ అవుట్ డోర్ లో ఉన్నారు. చాలా కాలంగా విశాల్ అన్నా నగర్ లో గల ఇంటిలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిపైనే దుండగులు దాడి చేశారు. 

విశాల్ మేనేజర్ దాడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియదు. పరిశ్రమలో విశాల్ కి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆయన నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. తమిళ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంపై తెలుగువాడైన విశాల్ ఆధిపత్యాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. విశాల్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. 

అలాగే నిర్మాణ సంస్థ లైకా తో విశాల్ కి వివాదం నడుస్తుంది. లైకా సంస్థ విశాల్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ హైకోర్ట్ లో పిటిషన్ వేసింది. ప్రస్తుతం విశాల్ లాఠీ, తుప్పరివాలన్ 2, మార్క్ ఆంటోని చిత్రాల్లో నటిస్తున్నారు. లాఠీ త్వరలో విడుదల కానుంది. లాఠీ చిత్ర షూటింగ్ లో విశాల్ పలుమార్లు ప్రమాదానికి గురయ్యారు. డూప్ లేకుండా ప్రమాదకర స్టంట్స్ చేయడంతో విశాల్ కి గాయాలయ్యాయి. పలు హిట్ చిత్రాల్లో నటించిన విశాల్ తెలుగులో కూడా మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. 
 

click me!