
సూపర్ స్టార్ రజినీకాంత్ యువతకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. చెన్నై ఎయిర్పోర్ట్ బయట మీడియాతో మాట్లాడిన ఆయన, క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో ముఖ్యమని చెప్పారు.
సినిమా యాక్టర్లను చూసి చాలా మంది యువకులు బైక్ స్టంట్స్ వంటివి చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు కదా అని విలేకరులు అడిగినప్పుడు, రజినీకాంత్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. యువత తమ జీవితం, భవిష్యత్తు గురించి 'సీరియస్గా ఆలోచించుకోవాలి.. చెడు అలవాట్లతో తమకు తామే హాని చేసుకోవద్దని సూచించారు.
"యువత తమ చదువు, భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచించాలి.. యంగ్ స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు గాయాలైతే, అది వాళ్లకే నష్టం. చదువుపై దృష్టి పెట్టి, ఆరోగ్యంగా ఉండాలి. దయచేసి మరకద్రవ్యాలు, ఆల్కహాల్ వంటి వాటికి బానిసలు కావొద్దు. అలా చేస్తే మీ జీవితమే కాదు, మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జీవితం కూడా నరకంగా మారుతుంది. మీ స్నేహితుల్లో ఎవరైనా వాటిని వాడుతుంటే, వాళ్ల దగ్గరికి కూడా వెళ్లొద్దు" అని ఆయన గట్టిగా హెచ్చరించారు.
ఇక సినిమాల విషయానికొస్తే, రజినీకాంత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. 'జైలర్' సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
దీంతో పాటు, కమల్ హాసన్తో తన కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా రజినీకాంత్ ఒక మేజర్ అప్డేట్ ఇచ్చారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో, కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న 'తలైవర్ 173'లో కూడా ఆయన నటించబోతున్నారు.