పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. మలయాళ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటుడు శబరినాథ్ గుండెపోటుతో మరణించారు. 43ఏళ్ల శబరినాధ్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవం జరిగింది. గురువారం త్రివేండ్రంలో జరిగిన ఈ విషాద సంఘటన పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
2020 ప్రపంచానికి అత్యంత దుర్భర పరిస్థితులను పరిచయం చేసింది. మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కరోనా వైరస్ వలన ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా కుదేలయింది. షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో పాటు చిత్రాలు విడుదలకు నోచుకోకుండా పోతున్నాయి. దీనికి తోడు వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయారు. అనేక కారణాల చేత నటులు తుదిశ్వాస విడిచారు.
కాగా మలయాళ టీవీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శబరినాధ్ హఠాన్మరణం చెందారు. శబరినాధ్ స్నేహితులతో కలిసి బాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయనను త్రివేండ్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
శబరినాధ్ వయసు కేవలం 43ఏళ్ళు మాత్రమే. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిన్నుకుట్టు, స్వామి అయ్యప్పన్, అమల సీరియల్స్ ఆయనకు మంచి ఫేమ్ తీసుకువచ్చాయి. కొత్తగా ప్రారంభమైన పడతా పైన్ కిలి అనే సీరియల్ లో శబరినాథ్ మంచి పాత్ర దక్కించుకోవడం జరిగింది. శబరినాధ్ ఆకస్మిక మృతి మలయాళ టీవీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది.