
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. డైలాగ్లు ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మాటలకు సెపరేట్గా అభిమానగనం కూడా ఉంది. అంతేకాదు ఆయన సినిమాల్లో స్క్రీన్ప్లే స్మూత్ గా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఎంటర్టైనింగ్గానూ సాగుతుంది. సినిమా అయిపోయిందనే విషయం ఎండ్ కార్డ్ పడితే గానీ తెలియదు. అందుకే ఇతర సినిమా మేకర్స్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ప్లే విషయంలో సలహాలు, సహకారం తీసుకుంటారు.
ప్రస్తుతం ఆయన `భీమ్లా నాయక్`కి మాటలు, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. అయితే ఇప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన `డీజే టిల్లు` చిత్రానికి కూడా ఆయన సపోర్ట్ చేశారట. తాజాగా ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ వెల్లడించారు. `త్రివిక్రమ్ స్క్రిప్టు విషయంలో మంచి సూచనలు ఇచ్చారు.ఈ సినిమాతో త్రివిక్రమ్ గారిని తరుచూ కలవడం మాకు దొరికిన గొప్ప జ్ఞాపకాలు` అని వెల్లడించారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన 'డిజె టిల్లు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత.
`డీజే టిల్లు` చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం దర్శకుడు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `నేను కథ రాసుకున్నప్పుడు టిల్లు క్యారెక్టర్ కు సిద్ధు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సిద్ధూకు చెబితే చాలా బాగుందని ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధూ డైలాగ్స్ రాశాడు. మేమిద్దరం కలిసి రచన చేశాం. మేము మాట్లాడుకుంటున్నప్పడే చాలా సంభాషణలు వచ్చేవి. వాటిని సినిమాలో ఉపయోగించాం. నా దగ్గర ఇది కాక మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే నా తొలి సినిమా ప్రభావాన్ని చూపించాలి. జనాల్లోకి వెళ్లాలి. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథతో తొలి సినిమా రూపొందించాను.
సిద్ధూ నేనూ సినిమాను చూసే విధానం ఒకేలా ఉంటుంది. మా మధ్య ఎప్పుడూ క్రియేటివ్ విబేధాలు రాలేదు.` కృష్ణ అండ్ హిజ్ లీల` సినిమా విడుదలయ్యాక నిర్మాత వంశీ గారి దగ్గర నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. అప్పటికే మా దగ్గర `డీజే టిల్లు` కథ సిద్దంగా ఉంది. వెంటనే వెళ్లి చెప్పాం. ఆయనకు నచ్చడంతో సితారలో సినిమా మొదలైంది. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సహజమైన కామెడీ నవ్వులు పూయిస్తుంది.
ట్రైలర్ లో చూస్తే నాయిక చుట్టూ ముగ్గురు నలుగురు మగాళ్లు ఉన్నట్లు చూపించాం. ఆ నలుగురు సోదరులు అవొచ్చు, స్నేహితులు అవొచ్చు. కానీ సమాజం మహిళను ఆ సందర్భంలో చూసే కోణం వేరు. ఈ దృక్పథం తప్పు. అయితే ఈ విషయాన్ని సందేశంగా చెబితే ఎవరికీ నచ్చదు. లోతుగా వెళ్లి చర్చిస్తే విసుగొస్తుంది. కానీ నవ్విస్తూ, వినోదాత్మకంగా చూపిస్తే చూస్తారు. మేము ఎంటర్ టైనింగ్ దారిని ఎంచుకుని డిజె టిల్లు చేశాం. ట్రైలర్ లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు కానీ సినిమాలో కథానుసారం అలా కొంత రొమాంటిక్ సందర్భాలు ఉంటాయి. ఈ సినిమాకి `నరుడు బ్రతుకు నటన` అని ముందు టైటిల్ అనుకున్నాం. కానీ సినిమా గురించి ఎవరికి చెప్పినా ఇది `డిజె టిల్లు` కదా అనేవారు. దాంతో అదే పేరును టైటిల్ గా పెట్టుకున్నాం.
ఇందులో టిల్లు తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటాడు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో పోల్చుకుంటాడు. హీరోకున్న ఈ క్వాలిటీ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. సినిమాలో నాయిక పేరు రాధిక. మాటల్లో జాతీయ ఉత్తమ నటి రాధిక ఆప్తే అని సరదాగా అనుకున్నాం. అది సినిమాలో అలాగే పెట్టాం. నిర్మాత నాగవంశీ చాలా సపోర్ట్ చేశారు. ఏది ఎలా కావాలంటే అలాగే చేయండని ప్రోత్సహించారు. ఎప్పుడూ ఇది వద్దు అని చెప్పలేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కుటుంబ కథా చిత్రాల సంస్థ అని పేరుంది. అలాగని డిజె టిల్లు కథను తెరకెక్కించడంలో కాంప్రమైజ్ కాలేదు. సహజంగా మా కథలోనే ఎవరికీ ఇబ్బందిలేని అంశాలున్నాయి` అని చెప్పారు దర్శకుడు. అలాగే తనకు పవన్కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పారు.
మరోవైపు సోమవారం హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి `నీ కనులను చూశానే` పాటను విడుదల చేశారు. ఈ పాటకు రవికాంత్ పేరెపు సాహిత్యాన్ని అందించగా సిద్ధు పాడటం విశేషం. అడ్మైరింగ్ పాటలా సాగే ఈ గీతం కథానాయకుడి ప్రేమను ఆవిష్కరించింది. నీ కనులను చూశానే, ఓ నిమిషం లోకం మరిచానే, నా కలలో నిలిచావే, నా మనసుకు శ్వాసై పోయావే అంటూ సాగుతుందీ పాట.