‘మెగా’ హీరోల గిత్త మృతి

First Published Jun 1, 2018, 12:34 PM IST
Highlights

ప్రత్యేక పూజలు చేసి గిత్తకు అంత్యక్రియలు

ప్రవాసాంధ్రుడు, తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ గొర్రెపాటి నవనీతకృష్ణకు చెందిన ఈ ఎద్దు అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. అందులో విశేషం ఏముంది అంటారా..? ఈ ఒంగోలు గిత్త మెగా హీరోలతో కలిసి నటించింది. పవన్ కాటమరాయుడు చిత్రంలో ఈ గిత్త మనకు కనపడుతుంది. అంతేకాదు.. చిరంజీవి నటిస్తున్న సైరాలో కూడా ఈ గిత్త ఉంది. ఈ గిత్తతో కొన్ని పోరాట దృశ్యాలు తెరకెక్కించినట్లు సమాచారం. కాగా.. గురువారం ఈ గిత్త అనారోగ్యంతో కన్నుమూసింది.

ఒంగోలు జాతిని కాపాడేందుకు రైతుల్లో ఆసక్తి కలిగించేందుకు పశుప్రదర్శన పోటీలు నిర్వహించే గొర్రె పాటి నవనీత కృష్ణ 2014లో విశాఖపట్నంలో కొల్లూరి గోపాలకృష్ణ వద్ద ఒంగోలు జాతికి చెందిన ఎడ్ల జతను కొనుగోలు చేశారు. ఘంటసాలపాలెంలోని వేమూరి రాంబాబు పర్యవేక్షణలో ఎడ్ల జతకు తర్ఫీదునిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలు పశు ప్రదర్శన పోటీల్లో పాల్గొన్న ఈ ఎడ్ల జత ఎన్నో బహుమతులు కైవసం చేసుకున్నాయి. ఒకే రంగులో ఉండే ఈ జతను బ్లాక్‌ బ్రదర్స్‌గా పిలుస్తారు. ఈ జతలో ఒకటైన పెద్దది మృతి చెందటంతో గిత్త కళేబరానికి ప్రత్యేక పూజలు చేసి ఘంటసాలపాలెం గ్రామపురవీధుల్లో ఊరేగించి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు.

click me!