విక్రమ్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలు పోషించారు. ఇప్పుడు మరోసారి ఆయన `తంగలాన్` చిత్రంతో ప్రయోగం చేశారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
చియాన్ విక్రమ్ ప్రయోగాలకు కేరాఫ్. కోలీవుడ్లో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ప్రయోగాత్మక పాత్రలు చేసే హీరో విక్రమ్. పాత్రల కోసం తన శరీరాన్ని కష్టపెట్టడంలో వీళ్లు ముందుంటారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన విక్రమ్ ఇప్పుడు మరోసారి ప్రయోగాత్మక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన అడవి మనిషిలా మారిపోయారు. `తంగలాన్` చిత్రంలో ఆయన ఆదివాసి తెగల నాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు పా రంజిత్ `తంగలాన్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతీ తిరువోత్తు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ని విడుదల చేసింది టీమ్.
బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు. స్థానిక తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్ ను చూపించారు. ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. అందులో ఓ మాయా లేడీ వీరిని అడ్డుకుంటుంది. వీరిపై దాడులకు దిగుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ చూపించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి.
విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ బతకాలంటే చావుతో పోరాడాల్సిందే అని చెప్పడం, `చావుని ఎదురిస్తేనే ఇక్కడ జీవితం` అంటూ విక్రమ్ చెప్పే డైలాగ్ హైలైట్గా నిలిచింది. బతుకు కోసం పోరాటం కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుంది. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు `తంగలాన్` ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ మూవీ రా అండ్ రస్టిక్గా, యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. అదే సమయంలో విక్రమ్ లుక్ సైతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.