ఓటీటీలో `తలైవి`.. బట్‌ చిన్న ట్విస్ట్!

By Aithagoni RajuFirst Published Apr 22, 2021, 9:24 AM IST
Highlights

ఓటీటీ ఇప్పుడు విడుదల విషయంలో కొంత ఊరటనిస్తుంది. చాలా సినిమాలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా `తలైవి` చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

కరోనా విజృంభన నేపథ్యంలో సినిమాలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. కరోనా విలయతాండవం చేస్తున్న కారణంగా థియేటర్లని బంద్‌ చేస్తున్నారు. అదే సమయంలో థియేటర్‌కి జనం రావాలంటే భయపడుతున్నారు. దీంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మరో గత్యంతరం లేదు. అయితే థియేటర్ కి ఆల్టర్‌నేట్‌గా ఉన్న ఓటీటీ ఇప్పుడు విడుదల విషయంలో కొంత ఊరటనిస్తుంది. చాలా సినిమాలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా `తలైవి` చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

నిజానికి ఈ సినిమా ఈ నెల 23న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే ఇప్పుడు దీన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు. దీన్ని ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ పెట్టారు. ఓటీటీలో విడుదలకు ముందు థియేటర్లో విడుదల చేస్తామని చెప్పారు. దీంతో ఊరించి ఉసూరుమనిపించారు. అయితే ఇది కావాలని సినిమా మాఫియా క్రియేట్‌ చేస్తున్న రూమర్లు, వీటిని నమ్మవద్దు అని కంగనాతోపాటు చిత్ర బృందం తెలిపింది. 

తమిళనాడు మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` సినిమా రూపొందిన విషయం తెలిసిందే. తలైవిగా కంగనా రనౌత్‌ నటించగా, ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ఎంజీఆర్‌గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విబ్రి మోషన్‌ పిక్చర్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బృందా ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

click me!