
తెలుగు సినీ సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కంపోజర్ ఎంఎం కీరవాణి. ఇటీవల బాహుబలి’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అందరి చేతా మన్ననలు పొందిన సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. అయితే ‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు కొద్ది గంటల ముందు ఆయన చేసిన ట్వీట్లు విమర్శల పాలవుతున్నాయి. తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువని వ్యాఖ్యానించిన కీరవాణి.. తెలుగు గీత రచయితలపైనా తీవ్ర విమర్శలు చేశాడు.
‘వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అని కీరవాణి విమర్శించాడు. దర్శకుల మీద చేసిన వ్యాఖ్యకు వారెవరూ స్పందించకపోయినా, గీత రచయితలు మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు. ప్రముఖ గీతదర్శకుడు భాస్కరభట్ల రవికుమార్ కీరవాణిని ట్విట్టర్ ద్వారా వ్యంగ్యంగా విమర్శించాడు. ‘అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణిగారే కాపాడగలరు. అయిదే నిమిషాలైతే అది సరిపోద్ది (‘విక్రమార్కుడు’ సినిమా కోసం కీరవాణి రాసిన ఓ పాటలోని లైన్)’అని ట్వీట్ చేశాడు. అనంతరం ‘ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నా. వేటూరి, సిరివెన్నెల తర్వాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణిగారేన’ని అంటూ వ్యంగ్య బాణాలు వేశాడు భాస్కరభట్ల.
అలాగే తాజాగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో ‘జనతాగ్యారేజ్’లోని ‘ప్రణామం’ పాటకు ఉత్తమ గీత రచయితగా అవార్డునందుకున్న రామజోగయ్య శాస్త్రి కూడా కీరవాణి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. ‘మంచి సందర్భం ఉంటే ఇప్పటి గీత రచయితలు కూడా అద్భుతంగా రాయగలరు. చెత్త సన్నివేశం ఇస్తే సిరివెన్నెల కూడా చెత్తగానే రాస్తార’ని అన్నాడు.