
తెలంగాణ ప్రభుత్వం ఐదు ఆటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. థియేటర్లలో ఇకపై ఐదు షోలు పడబోతున్నాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సినిమాటోగ్రఫీ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన BRK భవన్ లో ఎగ్జిబిటర్లతో సమావేశం జరిగింది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానీయా, రవి గుప్తా, సంతోష్ రెడ్డి, పలు శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. క్ డౌన్ సమయంలో థియేటర్ లు మూసి వేసినందున విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందజేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినిమా షూటింగ్ ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని, అదే సమయంలో తెలంగాణలో థియేటర్లో 5 వ ఆట ప్రదర్శనకు కూడా అనుమతిస్తున్నామని చెప్పారు.