
గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో ధనుష్ టైమ్ బాగోలేదు. ఇప్పటికే వికీ లీక్స్ లీకేజీలతో పరువు పోగొట్టుకుని సతమతమవుతున్న ధనుష్.. తల్లిదండ్రుల వివాదం నుంచి కూడా అంత ఈజీగా బయటపడేట్టు లేడు. తాజాగా కోర్టులో ధనుష్ తమ కుమారుడేనని, తమకు నెలకు 65వేల భరణం ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణ వేగవంతమైంది.
ధనుష్ ను డీఎన్ఏ పరీక్ష చేయించి తమ కుమారుడా కాదా అన్నది తేల్చాలని తాజాగా కదిరేశన్ దంపతులు మరో పిటిషన్ వేశారు. అయితే డీఎన్ఏ పరీక్షకు నటుడు ధనుష్ ససేమిరా అంటున్నారు. ధనుష్ తమ కొడుకు అంటూ మదురై జిల్లా మేలూర్కు చెందిన కదిరేశన్–మీనాక్షి దంపతులు మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో మొదలైన కలకలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజా పరిణామం ఏమిటంటే కదిరేశన్, మీనాక్షీ దంపతులు ధనుష్ తమ కొడుకేనని నిరూపించడానికి తాము డీఎన్ఏ పరీక్షకు సిద్ధం అని మరో పిటిషన్ను దాఖలు చేశారు.
మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరగగా వారి ఆరోపణల్లో నిజం లేదని, అందుకు ఆధారాలు తాము ఇప్పటికే కోర్టుకు సమర్పించామని ధనుష్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే డీఎన్ఏ పరీక్షకు అంగీకరించబోమని, అది నటుడు ధనుష్ ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా వాయిదా వేశారు.