సుధీర్ బాబు ఇన్నాళ్లు సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యాడు. ఒక్కటి ఇలా పడిందో లేదో అప్పుడే దూకుడు పెంచాడు. ఏకంగా పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు.
మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు హీరోగా నిలబడేందుకు ఇన్నాళ్లు స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. ఆయనకి కెరీర్ బ్రేక్ ఇచ్చే మూవీస్ పడటం లేదు సరికదా, వరుసగా నిరాశే ఎదురవుతుంది. ఈక్రమంలో ఆయనకు ఇటీవల `హరోంహర` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. హిట్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇక జోరు పెంచుతున్నాడు సుధీర్ బాబు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తను కూడా ఆ లీగ్ లోకి ఎంట్రీఇస్తున్నాడు. తాజాగా ఆయన పాన్ ఇండియా సినిమాని ప్రకటించడం విశేషం.
సుధీర్బాబు ఇప్పుడు సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుంది టీమ్. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ఆడియెన్స్కి అందించేలా, లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కి ఎంతో ప్రాధ్యానత ఇవ్వనున్నట్టు టీమ్ తెలిపింది. వెంట్ కళ్యాణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
`రుస్తుం`, `టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ`, `ప్యాడ్ మ్యాన్`, `పరి` వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఇప్పుడు సుధీర్ బాబు చేయబోతున్న పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు. లోతైన కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి జరిగే యుద్ధంగా ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుందని టీమ్ తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ , `ఈ స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్తో ట్రావెల్ అవుతున్నా. డిఫరెంట్ కంటెంట్తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంద`న్నారు సుధీర్ బాబు. ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఇది వెలికి తీస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు.