
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ క్రేజ్ వరాల వైడ్ గా వ్యాపిస్తోంది. ఎన్టీఆర్, రాంచరణ్ కి హాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. రాంచరణ్, ఎన్టీఆర్ కి బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం భారీ విజయం తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్.. మహాభారతం టచ్ తో అశ్వద్దామ పాత్ర ఆధారంగా హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించారు.
ఉరి హీరో విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కూడా హీరోగా నటిస్తారని అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి విక్కీ కౌశల్ తప్పుకున్నారు. ఈ చిత్రానికి 'ది ఇమ్మోర్టల్ అశ్వథ్దామ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. విక్కీ కౌశల్ తప్పుకోవడంతో ఈ చిత్రానికి సరిపడే క్రేజీ హీరో కోసం ఆదిత్య ధార్ అన్వేషణ మొదలయింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం తిరుగులేని పాన్ ఇండియా స్టార్స్ గా మారిన రాంచరణ్, ఎన్టీఆర్ లతో తన కలల ప్రాజెక్టు కోసం ఆదిత్య ధార్ సంప్రదింపులు మొదలు పెట్టినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరితో పాటు ఇప్పుడు కింగ్ ఖాన్ షారుఖ్ కూడా సీన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ముగ్గురు హీరోలలో ఒకరు మాత్రమే ఈ ప్రాజెక్ట్ కి ఎంపిక అవుతారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది ప్రాధమిక చర్చలు మాత్రమే అని తెలుస్తోంది. మరి షారుఖ్ ని పక్కకి నెట్టి ఈ క్రేజీ మూవీలో ఆర్ఆర్ఆర్ హీరోలు ఎవరో ఒకరు అవకాశం దక్కించుకుంటారేమో చూడాలి.
ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి 600 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. పఠాన్ చిత్రంతో షారుఖ్ దూకుడు మీద ఉన్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలాంటి మలుపు తిరుగుతోందో చూడాలి.