
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు.
అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ, ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది అని శ్రీ విష్ణు తెలిపారు.
ఈ చిత్రం ఐదుగురు కుర్రాళ్ల కథ. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు.
ట్రైలర్ లో చూపించిన గ్రామ వాలంటీర్ డైలాగ్ కాస్త వివాదం అయింది. అది ప్రజల్లోకి తప్పుగా వెళ్ళింది. ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతీ సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్ను స్ట్రాంగ్గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటాను అని శ్రీ విష్ణు వివరణ ఇచ్చాడు.
తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్గా ఉంటుంది అని శ్రీ విష్ణు తెలిపాడు.
Also Read: RRR కేరళ ఈవెంట్ లో మెరిసిన సూపర్ హీరో.. రాజమౌళి అంటే అంతే మరి