చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా బిగ్ బాస్ శివాజీ స్పందించారు. ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. మరోవైపు `గేమ్ ఆన్` మూవీ నుంచి ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవికి భారతీయ రెండో అత్యుత్తమ పురస్కారం పద్మ విభూషణ్ని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ రోజంతా చిరంజీవి ఇంటికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. కొందరు భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ 7లో పాపులర్ అయిన నటుడు శివాజీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
చిరంజీవికి ఈ అత్యున్నత పురస్కారం వరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులకు, ముఖ్యంగా తాను కూడా ఒక అభిమానిగా తనకు ఇది పండగ రోజు అని తెలిపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి స్ఫూర్తిగా నిలిచినట్టు తెలిపారు. 155 సినిమాలు, మూడు నంది అవార్డులు, పదకొండు లక్షల యూనిట్ల బ్లడ్ పంపిణీ, అలాగే కరోనా సమయంలో 35సెంటర్ల ద్వారా ఆక్సీజన్ అందించడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తమకు ఆదర్శంగా నిలిచారని, తమలో స్ఫూర్తి నింపారని, తాము కూడా సేవ చేసేలా ఇన్ స్పైర్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని చిరుకి ఎమోషనల్గా విషెస్ చెప్పారు శివాజీ.
`గేమ్ ఆన్`లో మెయిన్ పాయింట్ ఇదే..
ఇదిలా ఉంటే వచ్చే వారం చిన్న సినిమాల సందడి నెలకొనబోతుంది. యంగ్ హీరోలు సందడి చేయబోతున్నారు. అందులో భాగంగా `గేమ్ ఆన్` మూవీ రాబోతుంది. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించారు. దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి కస్తూరి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత.
`ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. నిర్మాతగా ఈ సినిమా నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నా. హీరో గీతానంద్ మా ఫ్రెండ్ కాబట్టి తనని ఎప్పటినుంచో చూస్తున్నా. తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తన బ్రదర్ దయానంద్ కు డైరెక్టర్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను.
శుభలేఖ సుధాకర్ లాంటి మంచి మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. సెట్లో చాలా సరదాగా ఉండేవారు. ఆదిత్య మీనన్ మంచి పర్ఫార్మర్. మధుబాలకి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతారు` అని చెప్పారు నిర్మాత రవి కస్తూరి.