Sirivennela Seetharama Sastry Death: డాక్టర్‌ కాదని రైటర్‌ అయ్యాడు.. సిరివెన్నెల టాలెంట్‌ని గుర్తించిన తమ్ముడు

By Aithagoni RajuFirst Published Nov 30, 2021, 6:17 PM IST
Highlights

పీజీ చేస్తే ఉద్యోగాలు వస్తాయనేది నమ్మకం లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని తండ్రి సలహా ఇచ్చాడు. కానీ అంత కష్టపడటం, అంత ఓపికగా చదువుతూ కూర్చోవడం తన వల్ల కాదని దాన్ని పక్కన పెట్టాడట సిరివెన్నెల. 

`డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను` అనేది సినిమాలకు సంబంధించిన యూనివర్సల్‌ డైలాగ్‌. తెలుగు లెజెండరీ పాటల రచయిత సిరివెన్నెల(Sirivennela Seetharama Sastry) విషయంలోనూ అదే జరిగింది. ఆయన డాక్టర్‌ని కాదని సినిమా రైటర్‌ అయ్యారు. సిరివెన్నెలని డాక్టర్‌ కావాలని ఫోర్స్ చేశారు ఆయన తండ్రి సీవీ యోగి. పీజీ చేస్తే ఉద్యోగాలు వస్తాయనేది నమ్మకం లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని తండ్రి సలహా ఇచ్చాడు. కానీ అంత కష్టపడటం, అంత ఓపికగా చదువుతూ కూర్చోవడం తన వల్ల కాదని దాన్ని పక్కన పెట్టాడట Sirivennela Seetharama Sastry. 

టెన్త్ పూర్తయిన తర్వాత ఆయనకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగిగా చేరాడు. ఆ సమయం నుంచే పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించాడు. సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రి కి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు `అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు` అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు.

ఆ టైమ్‌లో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో `సిరివెన్నెల` చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన `సిరివెన్నెల` చిత్రంలో `విధాత తలపున` పాటతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

ఆణిముత్యాల్లాంటి పాటలు.. ‘సిరి వెన్నెల’చిత్రంలో ‘విధాత తలపున’ పాటతో మొదలైన సీతారామశాస్త్రి పాటల పూదోటలో ఎన్నో అందమైన గులాబీలు విరిశాయి. ‘రుద్రవీణ’లో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’, ‘లలిత ప్రియ కమలం విరిసినదీ’, ‘స్వర్ణకమలం’లో ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’, శ్రుతి లయలు’లో ‘తెలవారదేమో స్వామీ’, ‘క్షణక్షణం’లో ‘జామురాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’, ‘మనీ’లో ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ’, 

‘శుభలగ్నం’లో ‘చిలకా ఏ తోడు లేక’, ‘నిన్నే పెళ్లాడతా’లో కన్నుల్లో నీ రూపమే, ‘సింధూరం’లో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే’, ‘నువ్వే కావాలి’లో ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’, ‘బొమ్మరిల్లు’లో ‘నమ్మక తప్పని నిజమైనా’, ‘గమ్యం’లో ‘ఎంత వరకూ ఎందుకొరకు’, ‘కొత్త బంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’, ‘చక్రం’లో జగమంత కుటుంబం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో దశవతారం, ‘అల వైకుంఠ పురములో’ ‘సామజవరగమన’ ఇలా చెప్పుకొంటే పోతే సీతారామశాస్త్రి పాటల భాండాగారంలో అమూల్యమైన ఆణిముత్యాలు, వజ్రాల్లాంటి పాటలు ఎన్నో.

సినిమా పాట కమర్షియలాటిలో, గ్లామర్‌లో కొట్టుకుపోతుండగా, దాన్ని పట్టుకుని లాగి, దానికి కొత్త దారి చూపించిన పాటల రచయిత సిరివెన్నెల. త్రివిక్రమ్‌ చెప్పినట్టు ఆయన సినిమా పాటలు రాయడం మనకు అదృష్టం, ఆయనకు దురదృష్టం అన్నారు. కానీ కమర్షియల్‌ సినిమాల్లోనూ ఆ కమర్షియల్‌ ఏమాత్రం తగ్గకుండా తనదైన పద ప్రయోగంతో కొత్త ఒరవడి సృష్టించిన ఘనత సిరివెన్నెల సొంతం. నేటితరం పాటల రచయితలకు ఆయన ఆదర్శప్రాయం. ఆయన దిక్సూచి. ఆయనో పాటల ట్రెండ్‌ సెట్టర్. 

also read: Sirivennela Seetharama Sastry Death: పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు..

also read: 

click me!