చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న కె విశ్వనాథ్ మరణించగా, ఇప్పుడు మరో స్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూశారు.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో స్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. ఇటీవలే కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయగా, శనివారం మధ్యాహ్నం వాణి జయరాం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె హఠాన్మరణం చిత్ర పరిశ్రమని శోకసంద్రంలో ముంచేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలాపది భాషల్లో వేల పాటలు పాడిన వాణి జయరాం మరణంతో ఇండియన్ సినిమానే తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. వాణి జయరాంకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇండియన్ సినిమా రంగంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూశారు. అంతకు ముందు దర్శకుడు సాగర్ హఠాన్మరణం చెందారు. వారం రోజుల క్రితం సీనియర్ నటి జమున తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఇండియన్ సంగీతం గర్వించదగ్గ గాయని వాణి జయరాం మరణించడం అత్యంత విషాదకరం. దాదాపు పదికిపైగా ఇండియన్ లాంగ్వేజెస్లో 20వేలకుపైగా పాటలు ఆలపించారు వాణీ జయరాం. ఆమె మరణం సంగీత రంగానికి తీరని లోటు అని చెప్పొచ్చు.
అంతేకాదు గతేడాది కాలంగా టాలీవుడ్లోనూ వరుస విషాదాలు సంబవిస్తున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, తొలితరం విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ఇలా వరుసగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అభిమానులను విషాదంలో ముంచెత్తారు. తొలి తరం సినిమా దిగ్గజాలు వరుసగా మరణించడంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకోవడం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
వాణీ జయరాం.. తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. వారి తల్లిదండ్రులకు ఎనిమిది మంది సంతానంలో ఐదవ సంతానంగా వాణీ జన్మించారు. తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం చిన్నతనంలోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో పాల్గొనడం విశేషం. ఆమె కర్నాటక సంగీతం, కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టీ.ఆర్, బాలసుబ్రమణ్యం, ఆర్ ఎస్ మణిల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
అయితే గాయనిగా సినిమా ఎంట్రీ కాస్త ఆలస్యంగానే సాగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత భర్తతో ముంబయిలో నివసిస్తుండగా, అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ని కలవడం, అలా ఆవిడ హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ `గుడ్డి`లోని `బోలే రే పపీ హరా` అనే పాటతో ఆమె గాయనిగా సినీ తెరంగేట్రం చేశారు. అలా సింగర్ అవ్వాలనే వాణీ జయరాం కల నెరవేరింది.