ఒక్కసారి గతంలోకి నడవాలనుంది ఉంది మావయ్య... సింగర్ సునీత భావోద్వేగ పోస్ట్

By team teluguFirst Published Sep 4, 2021, 1:11 PM IST
Highlights

సింగర్ సునీత బాలు గారితో ఎంతో అనుబంధం, ఆత్మీయత కలిగి ఉన్నారు. అనేక పాటలకు బాలుతో కలిసి గళం కలిపిన సునీత, పదుల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా స్టేజ్ షోలు చేశారు. అనేక బుల్లితెర కార్యక్రమాల్లో బాలుగారితో భాగమయ్యారు.

లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యం మనల్ని విడిచి వెళ్లి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. కరోనా మహమ్మారి బారిన పడిన బాల సుబ్రహ్మణ్యం సుదీర్ఘ పోరాటం అనంతరం 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రియులకు చీకటి రోజుగా తోచిన ఆ దినం, గాన గంధర్వుడిని లోకానికి దూరం చేసింది. 


కాగా సింగర్ సునీత బాలు గారితో ఎంతో అనుబంధం, ఆత్మీయత కలిగి ఉన్నారు. అనేక పాటలకు బాలుతో కలిసి గళం కలిపిన సునీత, పదుల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా స్టేజ్ షోలు చేశారు. అనేక బుల్లితెర కార్యక్రమాల్లో బాలుగారితో భాగమయ్యారు. కెరీర్ లో గురువుగా, స్నేహితుడిగా, బంధువుగా వెన్నంటి నడిపిన బాలు అంటే సునీతకు ఎనలేని గౌరవం, ప్రేమ అని చెప్పాలి. 


తాజాగా ఎస్పీ బాలుగారిని తలచుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ బావోద్వేగ పోస్ట్ చేశారు సునీత. ఆమె ఇంస్టాగ్రామ్ లో 'మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధం లో నా గొంతు మూగబోతోంది. సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ,ధైర్యం,బలం,నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చూస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా..' అంటూ కామెంట్ చేశారు. 


సునీత ఇంస్టాగ్రామ్ పోస్ట్ పలువురు బాలు గారి అభిమానులను కదిలించింది. కామెంట్స్ రూపంలో బాలుపై అభిమానులు ప్రేమ, ఆప్యాయత చాటుకుంటున్నారు.కాగా 2021 జనవరిలో సునీత మాంగో మీడియా అధినేత రామ్ ని రెండవ వివాహం చేసుకున్నారు. 

click me!