సెబీ కేసులో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలకు ఊరట

By Aithagoni RajuFirst Published Aug 4, 2021, 7:50 AM IST
Highlights

 షేర్‌ హోల్డింగ్‌ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్నారు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా. తాజాగా ఈ ఇద్దరికి సెబీ కేసులో ఊరట లభించింది. 

నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. దీంట్లో అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఓ వైపు ఈ కేసుతో శిల్పాశెట్టి ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సెబీ కేసు విచారణ వీరిని వెంటాడుతుంది. షేర్‌ హోల్డింగ్‌ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్నారు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా. తాజాగా ఈ ఇద్దరికి సెబీ కేసులో ఊరట లభించింది. నిర్ధేశిత పరిమితులకు లోబడే షేర్‌ హోల్డింగ్‌ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ అభిప్రాయపడింది. 

ఆ వివరాల్లోకి వెళితే, 2015 మార్చిలో 25.75శాతం వాటా కొనుగోలుతో వియాన్‌ ఇండస్ట్రీస్‌(గతంలో హిందుస్తాన్‌ సేఫ్టీ గ్లాస్‌ ఇండస్ట్రీస్‌)కి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ప్రమోటర్లుగా మారారు. ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లని ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ కింద కేటాయించింది. ఈ షేర్ల కేటాయింపు విషయాన్ని నిర్దిష్ట సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. 2013 సెప్టెంబర్‌ నుంచి 2015 డిసెంబర్‌ మధ్య కాలంలో వియాన్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల లావాదేవీలపై సెబీ విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు తర్వాత కూడా శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రాల షేర్‌హోల్డింగ్‌ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని సెబీ అభిప్రాయపడింది. తదనుగుణంగా వారిపై ప్రారంభించిన చట్టపరమైన చర్యలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది.  దీంతో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఈ కేసులో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రాజ్‌కుంద్రా 14 రోజుల పోలీస్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

click me!