ఓ వైపు తెలంగాణ వాదం, మరోవైపు లోకల్, నాన్ లోకల్ వాదం ఇప్పుడు `మా`లో హీటు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు. ఆయన ఓ టీవీ డిబేట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోటీ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్నికల డేట్ప్రకటించలేదు. కానీ ఇప్పటికే ఆరుగురు బరిలో నిల్చున్నారు. ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్నే ప్రకటించారు. అలాగే మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సివిఎల్ నర్సింహరావు, తాజాగా ఓ కళ్యాణ్ `మా` అధ్యక్ష బరిలో ఉన్నట్టు ప్రకటించారు. ఓ వైపు తెలంగాణ వాదం, మరోవైపు లోకల్, నాన్ లోకల్ వాదం ఇప్పుడు `మా`లో హీటు పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు. ఆయన ఓ టీవీ డిబేట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెండు విషయాలను ప్రశ్నించాలనుకుంటున్నట్టు తెలిపారు. అసలు `మా` ఎన్నికలను ఎవరు అనౌన్స్ చేశారు? ఇప్పుడున్న కమిటీ ప్రకటించిందా? అది కాకుండా అప్పుడే ఓ ప్యానెల్ అని ప్రకటించారు. నాకదే ఆగ్రహం కలిగించింది. టైమ్ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడది అనవసరం. ప్రకాష్ రాజ్కి చిరంజీవి మద్దతు ఇచ్చారో లేదో తెలియదు, నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడటం సరికాదు` అని తెలిపారు.
`మా`కి బిల్డింగ్ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడానని అంటున్నారు. ఏది బిల్డింగ్, ఫిల్మ్ నగర్లో మా బిల్డింగ్కి స్థలం ఎక్కడుంది. ఇక్కడ ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా నగర శివారు ప్రాంతంలో ఎక్కడో ఇస్తారు? అక్కడ నిర్వహించడం సాధ్యమేనా? ముందు దీనిపై `మా` కమిటీలో జనరల్ బాడీ పెట్టి తీర్మాణించాలి. ఓ నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వద్దకు వెళ్లాలి. అప్పుడు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడానికి ఉంటుందని తెలిపారు.
`మా`లో 900 మందికి అటు ఇటూ ఉన్నారు. వారిలో ఓటు వేసేది ఓ నాలుగు వందల మంది ఉంటారు. ఆ నాలుగు వందల మందికి సంబంధించిన విషయం ఇది. జనాలకు సంబంధం లేదు. దాని గురించి ఇంత రాద్దాంతం ఎందుకు. ప్రకాష్ రాజ్ ఏదైనా అడగదలుచుకుంటే డైరెక్ట్ అధ్యక్షుడికి ఓ లెటర్ రాసి, నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్ బాడీ పెట్టండి అని చెబితే బాగుండేది` అని అన్నారు.