
అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు నాగ చైతన్య. మొదటి సినిమా జోష్ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో మంచి విజయం సాధించాడు. ఇక ‘ఏమాయ చేసావె’ సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఇప్పటికే ఈ జంట ఆటోనగర్ సూర్య, మనం లో నటించారు. అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబ సభ్యులతోపాటు కొద్దిమంది అతిధుల సమక్షంలో శుక్రవారం అర్థరాత్రి 11 గంటల 52 నిమిషాలకు సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగచైతన్య. పెళ్లి వేడుక ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు నాగార్జున.
ఏమాయ చేసావే, మనం సినిమాలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కూడా. అప్పుడు సినిమా కోసం చేసుకున్న వీరు.. తాజాగా నిజమైన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం హిందూ సాంప్రదాయంలో వీరు వివాహం చేసుకోగా.. శనివారం క్రైస్తవ మతాచార పద్దతిలో చేసుకోనున్నారు. ఈ వివాహానికి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర సీమలకు సంబంధించిన ప్రముఖ నటీనటులతో పాటు దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇప్పటి వరకు మహేశ్ బాబు, రాజ్ తరుణ్, దర్శకుడు హరీష్ శంకర్, నాని, మంచు మనోజ్, కోన వెంకట్, నటీమణులు త్రిష, శ్రుతి హాసన్, కృతి కర్భందా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, మెహ్రీన్ పీర్జాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా సమంతకు విషెస్ చెప్పారు. ఒక పక్క పెళ్లి వేడుకలో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ సమంత ధన్యవాదాలు తెలియజేస్తోంది