
వరుసగా మూడు పరాజయాలు చూసినా ప్రభాస్ మేనియా ఇంచు కూడా తగ్గలేదు. పైగా లేటెస్ట్ మూవీ సలార్ మీద భారీ హైప్ ఏర్పడింది. రికార్డు ధరకు సలార్ హక్కులు అమ్ముడవుతున్నాయి. సలార్ ఏపీ/తెలంగాణా బిజినెస్ ముగిసినట్లు సమాచారం. భారీ ధర చెల్లించి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ సలార్ ధియేటరికల్ హక్కులు దక్కించుకున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సలార్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇది ప్రభాస్ కెరీర్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. నైజాం హక్కులు రూ. 67 కోట్లకు విక్రయించారట. సీడెడ్ రూ. 28 కోట్లు కాగా ఆంధ్ర హక్కులు రూ. 75 కోట్లకు అమ్మారట. నైజాం హక్కుల ధర బాహుబలి 2 లైఫ్ టైం వసూళ్లకు సమానం. బాహుబలి 2 ఏపీ/ తెలంగాణాలలో రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ రూ. 115.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆదిపురుష్ నైజాం హక్కులు రూ. 50 కోట్లకు అమ్మారు.
కాంబినేషన్ రీత్యా సలార్ చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడింది. కెజిఎఫ్ సిరీస్ తో దేశాన్ని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు కావడంతో హైప్ ఏర్పడింది. ఆయన గత చిత్రం కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటి దర్శకుడు ప్రభాస్ వంటి మాస్ హీరోతో చేసే చిత్రం గొప్పగా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ మొదలయ్యాయి. నెల రోజులకు ముందు నుండే హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుబోతున్నాయి.
సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె డబ్బింగ్ చెబుతున్నారు. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. అలాగే ఇది కెజిఎఫ్ కథలో భాగమే అంటున్నారు. జగపతిబాబు కీలక రోల్ చేస్తుండగా... పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.