
ఎప్పటికప్పుడు ఏదో వివాదం ఎంచుకుని దాన్ని తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సొసైటిలో జరిగే ప్రతీ చిన్న ఘటన ని స్క్రిప్టు చేసి.. దాని ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలపై ఎంత మంది కోర్ట్ కు వెళ్లినా, ఎవరు ఎమన్నా సరే.. తనదారి తనదే అన్నట్లు వర్మ మందుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారులో జరిగిన దిశ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేయడం ఎన్కౌంటర్ చేయడం జరిగిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ఈ చిత్రానికి 'ఆశ ఎన్కౌంటర్' అనే టైటిల్ను ఫిక్స్ చేశాడు. అయితే ఇప్పుడు కల్పిత కథ అంటూ ఆ తరహా సినిమాని రిలీజ్ కి సిద్ధం చేసారు. తాజాగా ఆషా ఎన్ కౌంటర్ ట్రైలర్ ని వర్మ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=FpmOxA48Gbc
ఈ ట్రైలర్ మొదట్లోనే ..``ఈ చిత్రం ఏ వ్యక్తులపైనా ఏ ఘటనల పైనా ఆధారపడి తీయలేదు.. కేవలం కల్పితం`` అంటూ ఇంట్రో ఇచ్చారు. ట్రైలర్ లో నిర్జన ప్రదేశంలో యువతిపై కొందరు దుండగుల అత్యాచారం హత్య అనంతరం విచారణలో భాగంగా పోలీసుల ఎన్ కౌంటర్ చేసి దుండగుల్ని హతమార్చడం వగైరా ఘటనల్ని కళ్లకు గట్టినట్టు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించింది. అత్యాచారం ఎంత ఘోరంగా జరిగిందో అంతకుమించి పోలీసులు చిత్రవధ చేసి దుర్మార్గుల అంతం చూసిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ ట్రైలర్ లో . క్రైమ్ డ్రామాకు రీరికార్డింగ్ ప్లస్ అయ్యేలా ఉంది. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్జీవీ ఎగ్జిక్యూట్ చేశారు. నవంబర్ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇక తెలంగాణ లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా చేసుకుని వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దిశ తండ్రి అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది. అయితే, ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని ఆనంద్ చంద్ర, అనురాగ్ న్యాయస్థానానికి తెలిపారు. సినిమా టైటిల్ ‘ఆశ ఎన్ కౌంటర్’ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. అంతేకాదు, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏప్రిల్ 16న ‘ఏ సర్టిఫికెట్’ ఇచ్చిందని, సెన్సార్ సర్టిఫికెట్ ను సవాల్ చేసేందుకు వీలుగా వారం రోజులు విడుదల ఆపుతామని దర్శక, నిర్మాతలు అప్పట్లో అంటే జూన్ లో కోర్టుకు తెలిపారు.