విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రీమేక్ రైట్స్కు దక్కనంత మొత్తం ‘డియర్ కామ్రేడ్’కు దక్కింది. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ హిందీ రీమేక్ హక్కులకు పలికిన ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
విడుదలకు ముందే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సినిమా బాగుందంటూ మెచ్చుకున్నారు. హిందీతో తనే రీమేక్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా హక్కుల కోసం కరణ్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిలిం నగర్ టాక్.
ఇదే గనుక నిజమైతే ఇప్పటివరకు బాలీవుడ్ లో ఏ సినిమా రీమేక్ కి ఈ రేంజ్ లో చెల్లించలేదనే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాను 'సింబా'గా రీమేక్ చేశారు. ఇప్పుడు లారెన్స్ 'కాంచన' చిత్రాన్ని 'లక్ష్మీబాంబ్'గా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్ హక్కులకు చెల్లించిన మొత్తం ప్రస్తుతం కరణ్ జోహార్ చెల్లించినదానికంటే చాలా తక్కువని అంటున్నారు.
నిజానికి 'డియర్ కామ్రేడ్' రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ లో చాలా మంది పోటీ పడ్డారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ.. కరణ్ ఆరు కోట్లు చెల్లించి హక్కులు సొంతం చేసుకున్నారట. బాలీవుడ్ లో ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారో చూడాలి!