
పెద్ద సినిమాలకు బడ్జెట్ పెరగటం అనేది కొత్త విషయం ఏమీ కాదు. మొదట అనుకున్న బడ్జెట్ కు చివరకు తేలే బడ్జెట్ కు చాలా తేడా ఉంటుంది. దిల్ రాజు వంటి నిర్మాతకు కూడా దాన్ని కంట్రోలు చేయటం చాలా సందర్బాల్లో సాధ్యం కాదు. అదే కోవలో #RC15 బడ్జెట్ కూడా పెరిగిపోయిందని సమాచారం. అందుకు రకరకాలు కారణాలు చెప్పుకున్నా..ఫైనల్ గా బడ్జెట్ దాటటమే రిజల్ట్ కనపడటం టీమ్ ని ఆందోళనలో పడేస్తోంది అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.తాజాగా ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమాని మొదట రూ.150 కోట్లలో పూర్తి చేద్దామనుకొన్నారు. ఆ తరవాత మరో రూ.20 కోట్లు పెరిగిందిట. ఇప్పుడు బడ్జెట్ ఫైనల్ లెక్కలు వేస్తే.. రూ.200 కోట్లు తేలిందని సమాచారం.. అయితే రూ.200 కోట్లలో ఈ సినిమా ముగియడం కూడా కష్టమే అంటున్నారు. మరో రూ.20 కోట్లయినా బడ్జెట్ దాటుతుందని దిల్ రాజు కు చెందిన టీమ్ లెక్కలేస్తున్నాడు. అంటే.. దాదాపు రూ.220 కోట్లవుతుందన్నమాట. దాంతో దిల్ రాజు ఇప్పుడు జీ స్టూడియోస్ చుట్టు తిరుగుతున్నారని అంటున్నారు.
అందుకు కారణం జీ స్టూడియోస్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రం మొత్తం థియేటర్, నాన్ థియేటర్ రైట్స్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇలా పెరిగిపోవటంతో డీల్ ని రివైజ్ చేయమని జీ స్టూడియేస్ ని రిక్వెస్ట్ చేయబోతున్నారట. అందుకోసం గత వారం రోజులుగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే రామ్ చరణ్ కు ఆర్.ఆర్.ఆర్ తో వచ్చిన క్రేజ్ తో ఖచ్చితంగా మార్కెట్ రెట్టింపు అవుతుంది. గ్లోబుల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి బడ్జెట్ అనేది పెద్ద సమస్యకాబోదు అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’, ‘అధికారి’ అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ‘C..E..O’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. చరణ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్కి పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంటుందని భావిస్తున్నారట.
తెలుగు నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. శంకర్ సినిమా అంటే ఎంత గ్రాండియర్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు మెగా ఫ్యాన్స్, మరో వైపు సినీ ప్రేక్షకులు RC15 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్..కొన్ని తప్పని సరి పరిస్దితుల్లో ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.