
మాస్ మహారాజాకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. వరుస పరాజయాల అనంతరం `క్రాక్` ఊపిరిని పోస్తే వరుసగా రెండు పరాజయాల అనంతరం `ధమాకా` కొత్త ఉత్సాహాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన `ధమాకా` చిత్రం డిసెంబర్ 23న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. మొదట సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఓల్డ్ స్టోరీ అనే టాక్ వచ్చింది. కానీ మాస్ ఎలిమెంట్స్, పాటలు, ఫైట్స్, కామెడీ పండటంతో సినిమాకి జనం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సినిమా వంద కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. నేటి(మంగళవారం) కలెక్షన్లతో వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కాబోతుండటం విశేషం. దీంతో రవితేజ సైతం ఈ సక్సెస్ విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఈ స్థాయి హిట్ రావడంతో ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ సక్సెస్ మాస్ మహారాజా పారితోషికం పెంచబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే `క్రాక్` తర్వాతనే ఆయన పారితోషికం పెంచారు. సుమారు ఇరవై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. గత సినిమాలకు ఆయన ఆ స్థాయిలో అందుకున్నారని టాక్ అదే సమయంలో ఇప్పుడు ఆయన కీలక పాత్రలో నటించిన `వాల్తేర్ వీరయ్య` చిత్రానికి సంబంధించిన పారితోషికం లీక్ అయ్యింది. దీనికి భారీగానే మాస్ మహారాజా తీసుకుంటున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
చిరంజీవి హీరోగా రూపొందుతున్న `వాల్తేర్ వీరయ్య`లో పోలీస్ అధికారిగా రవితేజ నటిస్తున్నారు. చిరుకి సోదరుడి పాత్ర అని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకుంది. ఆయన పాత్ర సినిమా సెకండాఫ్లో వస్తుందని ఇటీవల చిరు తెలిపారు. ఆ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందట. సెకండాఫ్ని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తుందని, ఉన్న నలభై నిమిషాలే అయితే సినిమాని పరుగులు పెట్టించేలా ఉంటుందని తెలుస్తుంది. చిత్ర బృందం కూడా అదే విషయం చెబుతుంది.
అయితే ఈ సినిమాలోని తన పాత్రకి రవితేజ భారీగానే డిమాండ్ చేశారని టాక్ నడుస్తుంది. సుమారు రూ. 18కోట్లు ఆయన కోట్ చేశారట. నిర్మాతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా కోటి తగ్గారని, ఇప్పుడు రూ.17కోట్లు అందుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాకి ఆయనకు పదిహేను కోట్లకుపైగా అందుతుందని టాక్.
చిరంజీవి 154వ సినిమాగా బాబీ దర్శకత్వంలో రొటీన్ మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కుతుంది. కథ పాతదే అయినా టేకింగ్ అదిరిపోయేలా ఉంటుందని, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా, దాన్ని మించి ఉంటుందని చిరంజీవి తెలిపారు. చిరంజీవిలోని ఓల్డ్ మాస్ని బయటకు తెచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో చిరుకి జోడీగా శృతి హాసన్ నటించగా, రవితేజ సరసన కేథరిన్ థ్రెసా కనిపించనుందని సమాచారం.