వర్మ గురువారం రాత్రి సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్స్ వేశారు. సదరు ట్వీట్స్ లో సీఎం జగన్ ని పొగుడుతూనే..వైసీపీ పార్టీలోని ముఖ్య నాయకులపై విమర్శలు చేశాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కొత్త బాధ్యత చేపట్టారు. ఆయన టికెట్స్ ధరల తగ్గింపుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన వాదనలు వినిపిస్తున్నారు. గత వారం రోజులుగా వర్మ వరుస ప్రశ్నలతో ఏపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని(Perni Nani)తో ఆయనకు ట్విట్టర్ వార్ నడిచింది. ఇద్దరూ తమ తమ పాయింట్స్ తో ట్విట్టర్ వేదికగా వాదనకు దిగారు. టికెట్స్ ధరలు తగ్గించడం వలన హీరోల రెమ్యూనరేషన్స్ తగ్గవని, అదే సమయంలో క్వాలిటీ తగ్గుతుందని, నిర్మాతలకు సినిమాలు తీయాలనే ఆసక్తి పోతుందనేది వర్మ వాదన. అసలు సినిమా అనేది నిత్యావసర వస్తువు కానప్పుడు.. ధరలపై నియంత్రణ ప్రభుత్వ పరిధిలోకి రాదంటారు.
మొత్తంగా పదుల కొలది పాయింట్స్ లేవనెత్తుతున్న రామ్ గోపాల్ వర్మ టికెట్స్ ధరల తగ్గింపు ముమ్మాటికీ సరైన నిర్ణయం కాదంటున్నారు. కాగా వర్మ గురువారం రాత్రి సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్స్ వేశారు. సదరు ట్వీట్స్ లో సీఎం జగన్ ని పొగుడుతూనే..వైసీపీ పార్టీలోని ముఖ్య నాయకులపై విమర్శలు చేశాడు.
వైసీపీ పార్టీలో నేను ప్రేమించే, అభిమానించే వ్యక్తి మీరు ఒక్కరే(వైఎస్ జగన్). వ్యక్తిగతంగా మీరంటే నాకు అభిమానం. అయితే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలు, ఇగోల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శ్రేయోభిలాషిగా నా సలహా ఇదే.. అంటూ ట్వీట్ చేశారు. పరోక్షంగా టికెట్స్ ధరల తగ్గింపు నిర్ణయం సీఎం జగన్ (CM YS Jagan) తీసుకున్నది కాదని, పార్టీలోని కొందరు నేతలు తమ వ్యక్తిగత పగలు, ప్రయోజనాల కోసం ఆయనను ప్రేరేపిస్తున్నారన్న అభిప్రాయం వర్మ వ్యక్తం చేశారు.
ఇక వోడ్కా మత్తులో వర్మ ఈ ట్వీట్స్ చేశాడేమో తెలియదు కానీ... తర్వాత డిలీట్ చేశారు. టికెట్స్ ధరల తగ్గింపు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సమస్యకు సీఎం జగన్ ని బాధ్యుడిని చేయకపోవడం ఆశ్యర్యంగా ఉంది. ఈ నిర్ణయం వెనుక ఉంది కేవలం ఆయనకు సన్నిహితంగా ఉన్న మంత్రులే అని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్స్ చేశారు.
మరోవైపు పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా ఉన్న నాగార్జున టికెట్స్ ధరలపై సానుకూలంగా స్పందించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న ధరలతో నాకు ఎలాంటి సమస్య లేదని, నా సినిమాలకు ఆ ధరలు సరిపోతాయని చెప్పి బాంబు పేల్చాడు. నాగార్జున వాఖ్యలతో ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరలు కొందరి సమస్య మాత్రమే... ఇది ఇండస్ట్రీ సమస్య కాదన్నట్లు పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది. ఏది ఏమైనా దీనిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుందని ఏపీ మంత్రులు తెలియజేస్తున్నారు.