
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్కి గుడ్ బై చెప్పి బాలీవుడ్లోనే సినిమాలు చేస్తుంది. ఆమె తెలుగులో నటించి రెండేళ్లు అవుతుంది. బాలీవుడ్లో వరుసగా ఆఫర్లు వస్తుండటంతో అక్కడ చేయాల్సి వస్తుందని, తెలుగులో సినిమాలు చేసేందుకు టైమ్ లేదంటోంది రకుల్. అయితే అక్కడ కూడా ఈ బ్యూటీకి విజయాలు రావడం లేదు. టాలీవుడ్లోనూ ఆమెకి సక్సెస్రేట్ చాలా తక్కువ. బాలీవుడ్లో ఆఫర్లు వచ్చినా, చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు.
మరోవైపు తరచూ రకుల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తెలుగులో చేయకపోవడం పట్ల తెలుగు ఆడియెన్స్ కాస్త విమర్శలు గుప్పిస్తూ, ట్రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్కే పరిమితం కావడంపై కూడా సెటైర్లు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్ దీనిపై స్పందించింది. సోషల్ మీడియాలో తన అసహనం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న విషయాలను పెద్దగా చూస్తున్నారని, వివాదంగా మారుస్తున్నారని వ్యాఖ్యానించింది.
హిందీ, తెలుగు అనే తేడాలపై ఆమె రియాక్ట్ అవుతూ, హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ వేర్వేరు కాదని, రెండూ ఒక్కటే అని, అన్ని ఇండియన్ సినిమాలో భాగమనే అని పేర్కొంది. ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదని, అన్నిటికన్నా ప్రేక్షకులే ముఖ్యమని, మంచి సినిమాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని చెప్పింది. మన దేశంలో గొప్ప ఆలోచనలు కలిగిన దర్శకులు ఉన్నారని, వారు ఇండియన్ సినిమాకి మంచి పేరు తెచ్చే సినిమాలు చేస్తున్నారని వెల్లడించింది రకుల్. కరోనా కారణంగా ఇప్పుడు ఓటీటీలకు కూడా ఆదరణ పెరిగిందని, బాగున్న సినిమాని థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూచూస్తున్నారని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తమ ప్రేమని బహిర్గతం చేస్తున్నారు. ఇటీవల ఓ ఛారిటీ ఈవెంట్లోనూ కలిసే పాల్గొనడం, కలిసే ర్యాంప్ వాక్ చేయడం విశేషం. ఆడియెన్స్ ని ముందస్తుగానే ప్రీపేర్ చేస్తుందీ హాట్ హీరోయిన్.
ఇదిలా ఉంటే గతేడాది బాలీవుడ్లో వరుస సినిమాలతో సందడి చేసింది రకుల్. ఏకంగా ఒక్క ఏడాదిలోనే ఐదు సినిమాలు చేసింది. `ఎటాక్`, `రన్వే34`, `కట్పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్` సినిమాల్లో మెరిసింది. ఈ ఐదు నిరాశ పరిచాయి. ఈ ఏడాది `ఛత్రివాలి` సినిమాతో మెరిసింది. ఓటీటీలో వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. చెప్పుకోదగ్గ హిట్ కాకపోయినా, రకుల్కి కాస్త రిలీఫ్నిచ్చే ఫలితం వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `మేరి పత్ని కా రీమేక్`, `ఇండియన్ 2` చిత్రాల్లు చేస్తుంది.