
నటి రాఖీ సావంత్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని అంబోలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అభ్యంతరకరమైన భాష వాడినందుకు గత ఏడాది రాఖీ సావంత్పై నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాఖీ సావంత్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో దిండోషి కోర్టు రాఖీ సావంత్ ముందస్తు బెయిల్ బుధవారం (జనవరి 18) తిరస్కరించింది. అయితే రాఖీ సావంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని షెర్లిన్ చోప్రా ట్విట్టర్లో షేర్ చేశారు.
‘‘అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ 883/2022కి సంబంధించి రాఖీ సావంత్ను అరెస్టు చేశారు. నిన్న రాఖీ సావంత్ ఏబీఏ 1870/2022ను ముంబై సెషన్ కోర్టు తిరస్కరించింది’’ అని షెర్లిన్ చోప్రా ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇక, ‘‘తన వీడియో లింక్లు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారనే ఆరోపణలపై మరో మహిళా నటి ఫిర్యాదు ఆధారంగా నటి రాఖీ సావంత్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి ముంబై పోలీసులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నాం’’ అని ఒక అధికారి తెలిపారు. రాఖీ సావంత్పై ఐపీసీలోని సెక్షన్లు 354ఏ, 509, 504తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా చెప్పారు. అంబోలి పోలీసు బృందం గురువారం సావంత్ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు.