సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఎదుటి వాళ్ల జీవితాలు, కెరీర్ లపై కామెంట్స్ పాస్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఎదుటి వాళ్ల జీవితాలు, కెరీర్ లపై కామెంట్స్ పాస్ చేస్తున్నారు. అవి ఒక్కోసారి అవతలి వాళ్ళను ఎంత ఇబ్బందికి గురి చేస్తాయో కూడా గుర్తించటం లేదు. తాజాగా హీరోయిన్ ప్రియా ఆనంద్ గురించిన ట్వీట్ ఒకటి అలాగే వివాదాస్పదమైంది. దానిపై ఆమె స్వయంగా స్పందించాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ ప్రియా ఆనంద్ను ట్విటర్లో ఓ నెటిజన్ తీవ్రంగా కామెంట్ చేసారు. ఆమెతో కలిసి నటిస్తే దురదృష్టవంతులు అవుతారని అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. ‘‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో శ్రీదేవితో కలిసి ప్రియా ఆనంద్ నటించారు. ఆమె ఇటీవల చనిపోయారు. తాజాగా ‘ఎల్కేజీ’ సినిమాలో ప్రియా ఆనంద్తో కలిసి నటించిన సహనటుడు జేకే రితీశ్ కూడా మృతి చెందారు. ఆమెతో పనిచేస్తే దురదృష్టవంతులు అవుతారా..?’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన ప్రియ ఆనంద్ కు బాగా బాధ కలిగింది. వెంటనే నెటిజన్కు సున్నితంగా బుద్ధి చెబుతూ సమాధానం ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ట్వీట్లు చేశారు.
'‘నీలాంటి వ్యక్తుల మాటలకు సాధారణంగా నేను స్పందించను. కానీ నీ వ్యాఖ్యలు కఠినమైనవని నీకు తెలిపేందుకు రిప్లై ఇస్తున్నా. సోషల్మీడియాలో ఇలాంటి కామెంట్లు చూసి మౌనంగా ఉండిపోవడం సులభమే. కానీ నీ మాటల వల్ల ప్రజలు ఎంత బాధపడుతారో ముందు తెలుసుకో. కాబట్టి ఇలాంటి ట్వీట్లు చేసే ముందు ఓ నిమిషం ఆలోచించి.. దయ, మానవత్వంతో వ్యవహరించు’'' అని ప్రియ రిప్లై ఇచ్చారు.
అప్పుడా నెటిజన్ 'నన్ను క్షమించండి. నా తప్పును ఒప్పుకుంటున్నా. ఇవాళ నేను ‘ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘ఎల్కేజీ’ సినిమాలు చూశా. మీరే రెండింటిలో కామన్గా ఉన్నారు. అప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చింది. అందుకే అలా ట్వీట్ చేశా. మీరు ట్వీట్లు చదవరు అనుకున్నా. నేను అలా మాట్లాడినా.. మీరు ప్రేమగానే సమాధానం ఇచ్చారు' అని అన్నారు. ఇక ప్రియ ఆనంద్ తెలుగులో ‘లీడర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘180’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.